సొంత కూతుర్ని కడతేర్చిన తండ్రికి జీవిత ఖైదు..

by Kavitha |
సొంత కూతుర్ని కడతేర్చిన తండ్రికి జీవిత ఖైదు..
X

దిశ, సంగారెడ్డి అర్బన్: అనారోగ్యంతో బాధపడుతున్న సొంత కూతురిని గొంతు నులిమి కిరాతకంగా కన్న తండ్రి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె జ్వరంతో చనిపోయినట్లు నమ్మబలికాడు. ఈ నేరంలో నిందితున్ని మంగళవారం సంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించారు.

కన్న కూతుర్ని చంపేశాడు..

కాట్రోత్ రవి నాయక్ (41) తన భార్య చనిపోవడంతో రెండో భార్యతో సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. తన మొదటి భార్య కూతురు రేణుక వయస్సు (13) నవాబ్ పేట కస్తూర్బా పాఠశాలలో చదువుకుంటుంది. 2020 సంవత్సరంలో ఆమె ఆరోగ్యం బాగా లేనందున చికిత్స కోసం సదాశివపేటకు తీసుకొని వచ్చి, తిరిగి వెళుతుండగా మార్గ మధ్యలో గొంతు నులిమి చంపి, జ్వరంతో చనిపోయిందని చెప్పాడు. ఆమె మెడపై కమిలిన గాయాలున్నాయని, ఆమె మరణం పట్ల అనుమానం ఉందని, చట్టరీత్య తగు చర్య తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేయడంతో అప్పటి వికారాబాద్ టౌన్ ఎస్ హెచ్ ఓ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు.

అనుమానాస్పద మృతి క్రింద ‘0’ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును సదాశివపేట పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేశారు. ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన అప్పటి ఎస్ హెచ్ ఓ శ్రీధర్ రెడ్డి ఇన్స్పెక్టర్, ఛార్జ్ షీట్ దాఖలు చేయగా కేసు పూర్వపరాలను విన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవాని చంద్ర నిందితునికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులు అప్పటి ఎస్ హెచ్ ఓ. శ్రీధర్ రెడ్డి ఇన్స్పెక్టర్, ప్రస్తుత ఎస్ హెచ్ ఓ. మహేష్ గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ, కోర్టు డ్యూటీ హెడ్ కానిస్టేబుల్స్ రవి, వెంకటేశ్వర్లు, కోర్టు లైజనింగ్ అధికారి కె. సత్యనారాయణ ఎస్ఐలను జిల్లా ఎస్పీ అభినందించారు.

Next Story

Most Viewed