యాసంగి వరకల్లా ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి.. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..

by Sumithra |
యాసంగి వరకల్లా ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి.. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..
X

దిశ, దుబ్బాక : యాసంగి వరకల్లా దుబ్బాక నియోజకవర్గంలో సాగునీటి గోస లేకుండా చర్యలు తీసుకోవాలని దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరువు కాటకాల మూలంగా దుబ్బాక నియోజకవర్గంలో రైతుల జీవితాలు ఆగమయ్యాయని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించి బీడు భూములను సస్యశ్యామలం చేయడానికే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు నిర్మించారన్నారు.

నేడు ప్రాజెక్టుల్లో నిండా నీళ్లు ఉన్నాయని, వాటిని ప్రతి ఎకరాకు అందించేలా ప్రధాన, ఉపకాలువలను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజుల్లోనే నియోజకవర్గంలోని కాలువలు పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారని తెలిపారు. శంకరంపేట కాలువకు సంబంధించి అహ్మద్ షా పూర్, ఇబ్రాహీంపూర్, వల్లూరు వద్ద అటవీ నుండి వెళ్లే కాలువ నిర్మాణం కోసం అటవీ శాఖ వారు సహకరించాలని కోరారు. ప్రధాన కాలువలు, ఉపకాలువల కోసం పలు ప్రాంతాల్లో రైతులు అడ్డుకుంటున్నారని, దయచేసి సాటి రైతులకు సాగునీటి సౌకర్యం కోసం సహకరించాలని కోరారు.

ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, పెద్దలు, రైతులు కాలువ నిర్మాణం జరిగేలా చూడాలని కోరారు. చాలా గ్రామాల్లో పాత పరిహారం కోసం రైతులు ఒప్పుకోవడం లేదని, చెక్కులు తీసుకోవడం లేదని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ప్రస్తుతం ఉన్న పరిహారం అందేలా చూడాలన్నారు. ఉపకాలువలకు భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన కాలువలు పూర్తి అయినప్పటికీ ఉపకాలువలు నిర్మించకుంటే చెరువు కుంటల్లోకి, పొలంలోకి సాగునీళ్లు అందించే అవకాశం ఉండదన్నారు. కాలువల నిర్మాణంకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈలు బుచ్చయ్య, జీవన్, నరేష్, బాలకృష్ణ, ఏఈలు ప్రసాద్, ప్రదీప్ రెడ్డి, ప్రకాష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed