BRS : మహాత్మా.. కాంగ్రెస్ కు బుద్ధి ప్రసాదించు : బీఆర్ఎస్ వినతులు

by Y. Venkata Narasimha Reddy |
BRS : మహాత్మా.. కాంగ్రెస్ కు బుద్ధి ప్రసాదించు : బీఆర్ఎస్ వినతులు
X

దిశ, వెబ్ డెస్క్ : అధికారంలోకి వచ్చి 420రోజులైనా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(Congress) ఇచ్చిన 420 హామీల(420 Election Assurances) లో ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపిస్తూ మహాత్మగాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్(BRS) చేపట్టిన నిరసనల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు గాంధీ విగ్రహాలకు, చిత్రపటాలకు వినతి పత్రాలు అందించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) పిలుపు మేరకు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు పూర్తి చేయనందుకు నిరసనగా కాంగ్రెస్ పాలకులకు హామీలను అమలు చేసే బుద్ధి ప్రసాదించాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు అందించారు.

420 హామీలను వెంటనే నెరవేర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో మహాత్మగాంధి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినతి పత్రాల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు మాట్లాడుతూ అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చి కాంగ్రెస్‌ అధికారం చేపట్టిందని.. తీరా గెలిచాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. తులం బంగారం, నాలుగు వేల పెన్షన్, 2లక్షల ఉద్యోగాలు, రైతు భరోసా రూ.15 వేలు వంటి అనేక హామీలను విస్మరించిందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీ( Six Guarantees)లు అమలు చేయకుండా ప్రశ్నించే గొంతుకులపై ఉక్కుపాదం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజల తరఫున పోరాడుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా పేదల కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ తెలంగాణలో 420 హామీల‌ను విస్మరించిన కాంగ్రెస్ పార్టీ చార్ సౌ బీస్ పార్టీగా మారింద‌ని విమ‌ర్శించారు. దొంగ గాంధీలు తెలంగాణ‌కు వ‌చ్చి త‌ప్పుడు డిక్లరేషన్లు ఇచ్చి ప్రజ‌ల‌ను మ‌భ్యపెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చార‌ని మండిప‌డ్డారు.


Next Story

Most Viewed