ఆపరేషన్ హైడ్రా.. మాకూ కావాలి...!

by srinivas |
ఆపరేషన్ హైడ్రా.. మాకూ కావాలి...!
X

దిశ ప్రతినిధి, నిర్మల్: ఆపరేషన్ హైడ్రా..!.. ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో నానుతున్న మాట. హైదరాబాద్ జంట నగరాల్లో చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో నిర్మాణం పూర్తయిన, నిర్మాణంలో ఉన్న అనేక భవనాల సముదాయాలను కూల్చివేస్తున్న పరిణామాలపై అంతటా ఆసక్తి నెలకొంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా రేవంత్ సర్కారు అధికార రాజకీయ ఒత్తిళ్లను పక్కనపెట్టి హైడ్రా యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన నేపథ్యంలో భారీ మొత్తంలో నిర్మించిన అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్సులు, ఇతర బహుళ అంతస్తుల భవనాలను కూల్చివేస్తున్న ఘటనలు విస్తుగొలుపుతున్నాయి. అక్రమాలను ఇలా కూడా తొలగించవచ్చా..! అని గతంలో విన్నామే కానీ చూడలేదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి యంత్రాంగమే మన వద్దకు వస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని సైతం వ్యక్త పరుస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో భారీగా చెరువుల కబ్జాలు

గత ప్రభుత్వాల పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక చెరువులు పెద్ద మొత్తంలో కబ్జాలకు గురయ్యాయి. ముఖ్యంగా మున్సిపల్ కేంద్రాలుగా ఉన్న పలు పట్టణాల్లో చెరువుల కబ్జాలు భారీగా జరిగాయి. ఉమ్మడి జిల్లాకు కేంద్రంగా ఉన్న ఆదిలాబాద్ సహా కొత్త జిల్లాలుగా ఏర్పడిన నిర్మల్ మంచిర్యాల జిల్లా కేంద్రాల్లో ఉన్న అనేక చెరువులు కబ్జాలకు గురై కుచించుకుపోయాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న రాముని చెరువు భారీగా కబ్జాకు గురైంది. మరోవైపు పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీ ఏర్పడడానికి ముందు ఆ ప్రాంతంలో పెద్ద చెరువు ఉండేది ఇప్పుడు ఆ చెరువు ఆనవాళ్లు లేకుండా పోయాయి. దీన్నిబట్టి చెరువుల కబ్జాలు మంచిర్యాల పట్టణంలో ఏ స్థాయిలో జరిగాయో అర్థం అవుతుంది. అలాగే జన్నారం మండల కేంద్రంలోని ఓ చెరువు భారీగా ఆక్రమణలకు గురైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో ఉన్న ఖానాపూర్ చెరువు వద్ద ట్యాంక్ బండ్ నిర్మాణం పేరుతో అప్పటి అధికార పార్టీ నాయకులు కబ్జాలు పెట్టారు మరోవైపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మావల పరిధిలో ఉన్న భారీ తటాకం లోకి 200 ఫీట్ల మేర చొచ్చుకు వెళ్లి కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చెరువు ఎఫ్ టి ఎల్ లో అనేక నిర్మాణాలు కూడా జరిగాయి దీనిపై అనేక ఫిర్యాదులు వెళ్లినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గిన అధికారులు కనీస చర్యలు తీసుకోలేదు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఓ నేత అండదండలతో కబ్జాకోరులు భారీగా ఆక్రమణలు చేశారని ఈ ఆక్రమణల్లో సదరు నేతకు వాటా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.

నిర్మల్ జిల్లాలో మరీ ఎక్కువ

ఆపరేషన్ హైడ్రా చేస్తున్న అక్రమ కట్టడాల కూల్చివేత నేపథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో చెరువుల కబ్జాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. అలాంటి కార్యక్రమాన్ని చేపడితే నిర్మల్ జిల్లా కేంద్రంలో నిమ్మ నాయుడు కాలంనాటి గొలుసుకట్టు చెరువులకు పునరుజ్జీవం వస్తుందన్న అభిప్రాయాలు వ్యర్థం అవుతున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రం‌లో పట్టణ నడిబొడ్డుతో పాటు పట్టణం చుట్టూ సుమారు 13 పెద్ద చెరువులు ఉన్నాయి ఈ చెరువులకు ఒకదానితో ఒక చెరువుకు లింక్ ఇస్తూ కాలువలు ఉండేవి. పట్టణం భారీగా విస్తరించిన నేపథ్యంలో అనేకమంది కబ్జాదారులు చెరువుల లింకు కాలువలను మూసివేసి ఆక్రమణలకు పాల్పడ్డారు. వీటిపై అనేక బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం జరిగాయి.

ఆక్రమణలు, కబ్జాలతో ఈ చెరువు భూముల విస్తీర్ణం 50 శాతం పైగా కనుమరుగైందన్న అభిప్రాయాలు ఉన్నాయి. నీటిపారుదల శాఖ రెవెన్యూ రికార్డుల ప్రకారం బంగల్ పేట చెరువు 210.32 ఎకరాలు, ఖజానా చెరువు 98.22 ఎకరాలు, కొత్తచెరువు 33.11 ఎకరాలు, రామ్ సాగర్ చెరువు 37.23 ఎకరాలు, కురన్నపేట చెరువు 76.18 ఎకరాలు, సీతా సాగర్ గొల్లపేట చెరువు 48.11 ఎకరాలు, ఇబ్రహీం చెరువు 76.18 ఎకరాలు, కంచరోని చెరువు 74.19 ఎకరాలు, ధర్మసాగర్ చెరువు 65.10 ఎకరాలు, మోతి తలాబ్ చెరువు 132.06 ఎకరాలు, చిన్న చెరువు మంజులాపూర్ 81.34 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు అధికారుల వద్ద ఉన్న రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కానీ కబ్జాల కారణంగా ఈ చెరువులు ఇప్పుడు సగం విస్తీర్ణం కూడా లేకుండా పోయాయని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా చెరువుల ఎఫ్‌పీఎల్ పరిధిలో బహుళ అంతస్తుల భవనాలు పాఠశాలల సముదాయాలు వాణిజ్య భవనాలు నిర్మాణం జరిగిపోయాయి ఇలాంటి అక్రమ నిర్మాణాలు తొలగించడం అంత సులువైన పని కాదు హైడ్రా లాంటి కఠినమైన నిబంధనలతో అధికార యంత్రాంగానికి చేతికి పని చెబితే మాత్రమే ఇలాంటి ఆక్రమణలు తొలిగే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

హైడ్రా లాంటి బుల్డోజర్ రావాలి...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణలను తొలగించాలంటే హైదరాబాద్ లో జరుగుతున్న ఆపరేషన్ హైడ్రా లాంటి బుల్డోజర్ తమ జిల్లాకు తీసుకురావాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్ మంచిర్యాల ఆదిలాబాద్ పట్టణాలతో పాటు కొన్ని మండల కేంద్రాల్లోనూ భారీగా చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. భవిష్యత్ తరాలకు బహుళ ప్రయోజనాలు అందించే చెరువుల పరిరక్షణ జరగాలంటే ఇలాంటి కఠిన చట్టాలతో కూడిన సంస్థలకు అధికారం ఇవ్వాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed