రామరాజ్యం కోసం బీజేపీకి ఓటు వేయండి : వినోద రావు

by Disha Web Desk |
రామరాజ్యం కోసం బీజేపీకి ఓటు వేయండి : వినోద రావు
X

దిశ, ఖమ్మం టౌన్ : రామరాజ్య స్థాపన కోసం బీజేపీకి ఓటు వేయాలని, మరోసారి మోడీని గెలిపించాలని బీజేపీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో రెండుసార్లు ప్రధానిగా మోడీ తన సత్తా చాటారని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల కంచుకోటగా చెప్పుకుంటున్న జిల్లా అభివృద్ధి చెందలేదని, ఈసారి తనకు అవకాశం ఇస్తే కేంద్ర నిధులతో జిల్లాను అభివృద్ధిలో ముందు ఉంచుతానని పేర్కొన్నారు.

కేంద్ర పథకాలు ఇంటింటికి తీసుకెళ్తానని, దేశంలో మరోసారి మోడీ ప్రధాని కావడం లక్ష్యంగా ఇప్పటికే ప్రతి కార్యకర్త కృషి చేస్తున్నారన్నారు. మోడీ తోటే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. రేపు నామినేషన్‌కు కేంద్ర మాజీ హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఖమ్మం రానున్నట్లు తెలిపారు. రాజ్ నాథ్ సింగ్ రాకకు పలు మండలాల నుంచి భారీ సంఖ్యలో జనం హాజరుకానున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్ధానాలను మరచి ప్రజలను మోసం చేసి పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మునిగిపోయే నావా అని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, సన్నే ఉదయ్ ప్రతాప్, అల్లిక అంజయ్య, గేంటెల విద్యాసాగర్, కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, శ్యామ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed