చపాతీలు చేయనందుకు విద్యార్థినుల పై దాడి

by Sumithra |   ( Updated:2025-04-07 09:16:07.0  )
చపాతీలు చేయనందుకు విద్యార్థినుల పై దాడి
X

దిశ, కొత్తగూడెం : చపాతీలు చేయనందుకు విద్యార్థినులను చితక్కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామవరంలోని గిరిజన బాలికల గురుకులంలో 600 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకి 8 వ తరగతి విద్యార్థినులను అల్పాహారం కోసం చపాతీలు చేసేందుకు గురుకులంలోని ఓ ఉపాధ్యాయురాలు నిద్రలేపింది. కొందరు విద్యార్థినులు లేచి చపాతీలు చేస్తుండగా, 21 మంది విద్యార్థినులు నీరసంగా ఉందని చెప్పి నిద్ర లేవలేదు. దీనిని మనసులో పెట్టుకొని ఉపాధ్యాయురాలు ఈ 21 మంది స్టూడెంట్స్ ని ఉదయం 11 గంటల ప్రాంతంలో గదిలో కర్రతో చితకబాదింది.

బూతులు తిడుతూ, విద్యార్థినుల చేతులు తిప్పి కీళ్ల పై, మోచేతుల పై విచక్షణారహితంగా కమిలిపోయేలా కొట్టినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇందులోని కొందరు విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు తమ పై దాడి జరిగిందని సమాచారం అందించడంతో తల్లిదండ్రులు గురుకుల పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. అక్కడున్న ప్రిన్సిపాల్, సిబ్బంది తల్లిదండ్రులను బ్రతిమిలాడి ఇంకోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూసుకుంటామని సర్ది చెప్పారు. సుమారు రెండు గంటల పాటు గురుకులంలో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ అంశం పై గురుకులం ప్రిన్సిపాల్ ని వివరణ అడగగా ఉపాధ్యాయురాలు విద్యార్థినులను కొట్టింది నిజమే అని, సదరు ఉపాధ్యాయురాలికి మెమో జారీ చేశామని తెలిపారు.

Next Story

Most Viewed