రోడ్డంతా గుంతలే.. రాజీవ్ గాంధీనగర్ రోడ్డుకు మోక్షమెపుడు?

by Ramesh Goud |
రోడ్డంతా గుంతలే.. రాజీవ్ గాంధీనగర్ రోడ్డుకు మోక్షమెపుడు?
X

దిశ, మణుగూరు: మణుగూరు మండలంలోని రాజీవ్ గాంధీ నగర్ బీటీ రోడ్డంతా గుంతల మాయంగా మారింది. ఈ రోడ్డులో ఎక్కడ చూసినా పెద్దపెద్ద గుంతలు పడి దర్శనమిస్తున్నాయి. వాహదారులు గుంతలతో ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై కంకర రాళ్లుపై వెళ్లే వాహనదారులు అదుపుతప్పి కిందపడుతున్నారు. రాజీవ్ గాంధీ నగర్‌లో గతంలో ఉన్న బీటీ రోడ్డు ధ్వంసం కావడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమారు రూ.90లక్షలు నిధులు మంజూరయ్యాయి. అప్పట్లో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నాణ్యత లేని కంకర పోసి చేతులు దులుపుకున్నాడని స్థానికులు, వాహదారులు వాపోతున్నారు. దాదాపు ఏడాదిగా పనులు నిలిచిపోడంతో రోడ్డు అధ్వానంగా మారింది. ఈ రోడ్డుపై వెళ్లే భారీ వాహనాలతో దుమ్ము, ధూళి, రాళ్లు లేచి తమ ఇండ్లపై పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాక స్థానికులు, వాహదారులు అనేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలసత్వం వాహదారులకు శాపంగా మారింది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి, మంజూరైన నిధులు తెప్పించి, బీటీ రోడ్డు నిర్మించాలని రాజీవ్ గాంధీ నగర్ వాసులు కోరుతున్నారు.

రాత్రి గుంతలు కనిపించడం లేదు.. భాస్కర్‌రావు, రాజీవ్ గాంధీనగర్

రోడ్డు అధ్వానంగా తయారైంది. ఈ రోడ్డుపై ఎన్నోసార్లు కింద పడబోయేవాడని. .రాత్రులు గుంతలు కనపించడం లేదు. వాహనాలు గుంతలో దిగడంతో ఇబ్బందులు పడుతున్నాం. పైన తేలి ఉన్న కంకరతో వాహనాలు జారుతున్నాయి. ఎమ్మెల్యే స్పందించి, వెంటనే బీటీ రోడ్డును నిర్మించాలి.

తేలిన కంకరతో భయంగా ఉంది.. దీపక్, రాజీవ్‌గాంధీనగర్

ఈ ఏరియాలో కిరాణా దుకాణం పెట్టుకున్నాను. నిత్యం ఈరోడ్డు నుంచి దుమ్ము, ధూళి విపరీతంగా వస్తోంది. వాహనాలు వెళ్లే సమయంలో రోడ్డుపై ఉన్న కంకర రాళ్లు ఎక్కడ తగులుతాయో భయంగా ఉంది. కంకరతో వాహనదారులు కిందపడుతున్నారు. త్వరగా రోడ్డు నిర్మించాలి.


Next Story

Most Viewed