బోనాల పండుగకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వనం!

by Ramesh Goud |
బోనాల పండుగకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వనం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆషాడమాసం బోనాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి దేవాలయ కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు. గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ దేవాలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే బోనాల పండుగ సందర్భంగా జరిగే వేడుకలకు హాజరు కావాలని రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలుకుతూ.. ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని గజమాలతో సత్కరించారు. అనంతరం ఆలయ అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా కాంగ్రెస్ ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాగా తెలంగాణలో ప్రత్యేక పండుగగా జరిగే బోనాలు ఆషాడమాసంలో ప్రారంభం అవుతాయి. ఈ పండుగ కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ సంవత్సరం ఆషాడమాసం మొదటి ఆదివారం అయిన జూలై 7న గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయాల్లో ప్రారంభమై.. ప్రతి గురు, ఆది వారాలు నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ బోనాలు జరపనున్నారు.



Next Story