మంథని శివారంలో హైలెల్ ​బ్రిడ్జ్.. త్వరలో టెండర్ల పిలుపు

by Ramesh Goud |
మంథని శివారంలో హైలెల్ ​బ్రిడ్జ్.. త్వరలో టెండర్ల పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : జిల్లా కేంద్రాలలో బ్రిడ్జ్​ల నిర్మాణానికి సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలోని సర్కారు పెద్ద పీట వేస్తోంది. జిల్లా మంత్రులు, శానస సభ్యుల వినతి మేరకు ఆర్​ అండ్​ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వారి వినతులు స్వీకరించి ఆ మేరకు పనులు చేయిస్తున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లాలోని మంథని శివారం లో రహదారులను భారీగా విస్తరించనున్నారు. అయితే ఈ రోడ్ల నిర్మాణం కంటే ముందుగా బ్రిడ్జ్​లను నిర్మించాల్సి ఉంటోంది. తాజాగా మంథని శివారం లో 920 మీటర్ల పొడవున హైలెవల్​బ్రిడ్జ్​ను నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జ్ కు అటు ఇటు చెరో కిలో మీటర్​పొడవునా రోడ్డును కిందికి తగ్గిస్తూ నిర్మించాల్సి ఉంటోంది. ఈ బ్రిడ్జ్​ నిర్మాణం కోసం ప్రభుత్వం తాజాగా రూ. 125 కోట్లను కేటాయించింది.

ఈ క్రమంలో త్వరలో టెండర్లు పిలువనున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలోని మంథనిని మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్‌తో కలుపుతూ గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన ఈ వంతెన కోసం ప్రభుత్వం రూ. 125 కోట్లు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల తన పర్యటన సందర్భంగా వర్చువల్‌గా శంకుస్థాపన కూడా చేశారు. ఈ వంతెన మంథని , చెన్నూర్ మధ్య 70 కి.మీ మార్గాన్ని 35 కి.మీ.లకు తగ్గించి ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. అంతే కాకుండా ప్రాంతీయ వాణిజ్యాన్ని మరింతగా పెంచనుంది. మంథని నుండి చెన్నూర్ చేరుకోవడానికి కొందరు ఇప్పటికీ నదిని దాటడానికి ఎక్కువగా పడవలను ఇష్టపడతారు.

వేసవిలో నీటి మట్టం తగ్గడంతో, మట్టి రోడ్లు వేయడం ద్వారా ప్రజలు తమ వాహనాల ద్వారా నదిని దాటేవారు. ఈ రోడ్డును కేవలం ఏడాది వ్యవధిలోనే నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులు “దిశ” కు తెలిపారు. మంథని నియోజక వర్గంలో ఇరువైపులా రోడ్లు ఎప్పుడో వేసినవే ఎక్కవగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ఈ రోడ్డుకు మహర్ధశ రానుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, మానకొండూరు మండలం శంకరపట్నంలోని అరకండ్ల గ్రామం నుండి కన్నాపురం వరకు హైలెవల్​బ్రిడ్జ్​ను నిర్మించాల్సి ఉంది. దీనిపై ఇటీవలే మానకొండూరు ఎంఎల్​ఏ డాక్టర్​కవ్వంపల్లి సత్యనారాయణ ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లడం గమనార్హం.

Next Story