ఆ సమాచారం మొత్తం రహస్యంగా ఉంచాలి.. చిన్న అంశం కూడా లీకవ్వొద్దు.. అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |
ఆ సమాచారం మొత్తం రహస్యంగా ఉంచాలి.. చిన్న అంశం కూడా లీకవ్వొద్దు.. అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజావాణి(Prajavani) కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. మహాత్మజ్యోతిభా ఫూలే ప్రజా భవన్‌లో వారంలో రెండు రోజులు కొనసాగుతున్న ప్రజావాణిలో ప్రజలు ఇప్పటివరకు సమర్పించిన అర్జీలు, వాటిలో ఎన్ని పరిష్కారమయ్యాయి.. అర్జీల పరిష్కారానికి అధికారులు అనుసరిస్తున్న విధానాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వివిధ విభాగాలకు ప్రజావాణిలో ప్రత్యేక డెస్క్‌లు ఏర్పాటు చేశామని, గల్ఫ్ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అర్జీదారులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అత్యవసరమైన అర్జీలుంటే అక్కడికక్కడే పరిష్కరిస్తామని, అంబులెన్స్ సదుపాయం కూడా ప్రజావాణి జరిగే రోజుల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించగా, అందులో 54619 అర్జీలను ప్రజలు నమోదు చేసుకున్నారు. వీటిలో 68.4 శాతం (37384) అర్జీలు పరిష్కారమయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ప్రజావాణి అర్జీలను పరిష్కరించేందుకు మరింత పారదర్శకమైన, సమర్థవంతమైన విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజాభవన్‌లో జరిగే ప్రజావాణి డ్యాష్ బోర్డుతో అనుసంధానం చేయాలని చెప్పారు. దీంతో మండలస్థాయిలో, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో పరిష్కారమయ్యే అంశాలు వెంటవెంటనే అక్కడికక్కడే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజావాణి డ్యాష్ బోర్డు యాక్సెస్‌ను తనకు అందించాలని, ముఖ్యమంత్రికి లైవ్ యాక్సెస్ ఉండేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో తాను ఎక్కడ ఉన్నా ప్రజావాణి అర్జీల పరిష్కారం తీరును, ప్రజల నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వస్తున్నాయో తెలుసుకునే వీలుంటుందని అన్నారు. అర్జీల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేయటం వేగవంతమవుతుందని అన్నారు.

అర్జీల వివరాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల సమాచారాన్ని ఆన్ లైన్‌లో పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వాటి అమలు పురోగతి పారదర్శకంగా అందరూ తెలుసుకునేందుకు వీలుగా ఉండేలా ఈ పోర్టల్ రూపొందించాలని సూచించారు. ప్రజల వ్యక్తిగత భద్రతకు ఇబ్బంది లేకుండా అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ఏయే సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి.. వేటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది ముందుగా సమీక్షించుకోవాలన్నారు. అధికారుల స్థాయిలో కమిటీ వేసి అందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.



Next Story

Most Viewed