అన్నదాతల ఉసురుపోసుకున్నదే బీఆర్ఎస్ : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

by M.Rajitha |
అన్నదాతల ఉసురుపోసుకున్నదే బీఆర్ఎస్ : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్​పదేళ్ల పాలనలో అన్నదాతల ఉసురు పోసుకున్నదని, ఇప్పుడు కమిటీల పేరుతో ఆ పార్టీ నేతలు కహానీలు చెబుతున్నారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీలోని సీఎల్పీ మీడియా పాయింట్​వద్ద ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి లాంటి అనర్హుడిని కమిటీ చైర్మన్ గా నియమించి శవరాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు చేసిన లక్షా రుణమాఫీ మిత్తికే సరిపోయిందని విమర్శించారు. రైతుబంధు ఇస్తున్నామనే నెపంతో రైతులకు ఇచ్చే రాయితీలు ఎత్తివేశారన్నారు. అన్నదాతలకు సబ్సిడీ లో ఇచ్చే స్పిక్లర్లు, డ్రిప్పు పైపులు, వేరుశనగ విత్తనాలు, వరి విత్తనాలు, రోటవేటర్ కల్టివేటర్లు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రధాన కాలువలకు బొక్కలు పెట్టి గ్రామ గ్రామానికి సాగునీరు అందించామని ఊదరగొట్టారని దుయ్యబట్టారు. చివరకు వరి పండించొద్దని వరి వేస్తే ఉరి అని, వరి ధాన్యం కొనుగోలు చేయమని, కేవలం సన్నరకాలే పండించాలని రైతులను ఇబ్బందిపెట్టిన విషయాన్ని రైతులు మరిచిపోలేదన్నారు. అధికారం కోల్పోయి కడుపు మంటతో నేడు రైతులను రెచ్చగొట్టడం తప్ప ఏమీ చేయలేరన్న విషయం అందరికీ అర్థమైందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి దేశ చరిత్రలోనే నిలిచిపోయేలా ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.


Next Story

Most Viewed