BIG News: మోడీ, రేవంత్ భేటీలో ట్విస్ట్.. ఆ అంశాలపై పీఎం ప్రస్తావన

by Shiva |
BIG News: మోడీ, రేవంత్ భేటీలో ట్విస్ట్.. ఆ అంశాలపై పీఎం ప్రస్తావన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి భేటీ‌లో ఆసక్తికరమైన పరిణామాలు నెలకొన్నాయి. వారి భేటీలో రివర్స్ సీన్ నెలకొనడంతో రేవంత్ కలవరపాటుకు గురయ్యారు. రాష్ట్ర సమస్యలు వివరించడానికి వెళ్లిన రేవంత్‌కు మోదీ నుంచి ఎదురు పత్రం ఎదురవ్వడంతో సరికొత్త అనుభూతిని చూడాల్సి వచ్చింది. సీఎం ఇచ్చే వినతులను స్వీకరించిన ప్రధాని... ఆ తరువాత రివర్స్ అయ్యారు. కేంద్రం నిధులు ఇచ్చినా..తెలంగాణలో అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణమే వాటిని పరిష్కరించాలని సూచించారు. ఈమేరకు ఒక జాబితా కూడిన ఒక లేఖను ..సీఎంకు పీఎం అందించారు. ప్రధానమంత్రి అవాస్​యోజన కింద ఇళ్లు, ఎయిమ్స్​తదితర అంశాలు అందులో ఉన్నాయి. పీఎం లేఖ ఇచ్చిన విషయాన్ని సీఎం రేవంత్‌‌రెడ్డి స్వయంగా మీడియా చిట్‌చాట్‌లో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో పలు పెండింగ్ అంశాలకు సంబంధించిన జాబితాను ప్రధాని మోదీ అందించారు.

పెండింగ్‌లో మూడు మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు

వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మూడు మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని మోదీ అందించిన లేఖలో ప్రస్తావించారు. ఇందులో రిలయన్స్​మొబైల్​రూ.32797 కోట్ల పెట్టుబడులు పెడుతుందని, దీనికి సంబంధించిన రైట్​ఆఫ్​వే కింద అనుమతులు ఇవ్వాల్సి ఉండగా 2022 ఆగస్టు నుంచి రెండు రూట్లలో పెండింగ్‌‌లో ఉన్నాయని తెలిపారు. దేవాదుల, బీమా, శ్రీరాంసాగర్ రెండో దశ​ప్రాజెక్టులకు సంబంధించి 2023 జూలై నుంచి రూ.18189 కోట్ల విలువైన భూ సేకరణ పెండింగ్‌లో ఉందన్నారు. లిటిగేషన్​అంశాలను, అంచనాల సవరణలు పరిష్కరించాలని ఆ లేఖలో మోదీ సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్‌కి సంబంధించి రూ.1365.95 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ తదితర అంశాలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.

రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావన

శంషాబాద్‌లో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించిన ప్రభుత్వ భూమికి రూ.150 కోట్లు చెల్లించాల్సి ఉందని సీఎంకి సూచించారు. మనోహరాబాద్-కొత్తపల్లి నూతన రైల్వే‌లైన్, కాజీపేట-విజయవాడ మూడో‌లైన్ విద్యుదీకరణకు సంబంధించి రూ.3113.48 కోట్లు, 2020 సెప్టెంబర్​నుంచి భూసేకరణ, అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వాటిని త్వరగా క్లియర్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి‌కి ప్రధాని మోదీ సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష జరిపి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

మార్చి31లోగా అవాస్ సర్వే పూర్తి చేయండి

2016–17, 2017–18 ఏడాది కింద రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్​యోజన గ్రామీణ్​కింద 70,674 ఇళ్లు మంజూరు చేసినట్టు ప్రధాని చెప్పారు. ఇళ్లు కట్టనందున ఆ మొత్తాన్ని తిరిగి కేంద్రానికి పంపించాలని ప్రధాని సూచించారు. 2024లో ప్రధానమంత్రి అవాస్​యోజన కింద ఇళ్లు మంజూరు చేయాలని తెలంగాణ విజ్జప్తి చేసింది. లబ్ధిదారులే స్వయంగా ఇళ్లు నిర్మించుకునే విధానానికి అనుమతించాలని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 2018 అవాస్ సర్వేను పూర్తి చేయలేదని, దీనితో ఇండ్లకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించలేదని సీఎం రేవంత్‌కు ఇచ్చిన లేఖ ద్వారా మోదీ తెలిపారు. ఎందరు లబ్ధిదారులు ఉన్నారో లెక్క తెలకపోవడంతో ఇండ్లను కేటాయించలేకపోయినట్లు సీఎంకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. అవాస్​సర్వేను మార్చి 31లోగా పూర్తి చేయాలని ప్రధాని కోరారు. దీంతో అర్హుల సంఖ్య బయటపడితే ఇండ్ల మంజూరుకు మార్గం సుగమం అవుతుందని పీఎం సలహా ఇచ్చారు.

Next Story