స్మృతి మంధాన దూకుడు మామూలుగా లేదుగా.. ఆ అవార్డుకు మళ్లీ పోటీ

by Harish |
స్మృతి మంధాన దూకుడు మామూలుగా లేదుగా.. ఆ అవార్డుకు మళ్లీ పోటీ
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మరోసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుపై కన్నేసింది. జూన్‌ నెలలోనే తొలిసారిగా ఈ అవార్డు దక్కించుకున్న ఆమె వరుసగా జూలై అవార్డు రేసులోనూ నిలవడం విశేషం. సోమవారం ఐసీసీ జూలై నెలకు సంబంధించి పురుషుల, మహిళల విభాగాల్లో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నామినీలను ప్రకటించింది. జూలైలోనూ స్మృతి మంధాన తన ఫామ్‌ను కొనసాగించింది. సౌతాఫ్రికాతో ఏకైక టెస్టులో సెంచరీ చేసిన ఆమె.. టీ20 సిరీస్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 100 పరుగులు చేసింది. అలాగే, ఆసియా కప్‌లో స్మృతి మంధాన 173 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.

ఆమెతోపాటు మరో భారత ఓపెనర్ షెఫాలీ వర్మ కూడా ఈ అవార్డు కోసం పోటీపడుతున్నది. జూలై నెలలోనే ఆమె టెస్టుల్లో 229 పరుగులు, టీ20ల్లో 245 రన్స్ చేయడం విశేషం. సౌతాఫ్రికాతో టెస్టులో డబుల్ సెంచరీతో కదంతొక్కి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. స్మృతి మంధాన, షెఫాలీ వర్మలతోపాటు శ్రీలంక కెప్టెన్ ఆటపట్టు కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యింది.

మరోవైపు, పురుషుల విభాగంలో టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తొలిసారిగా అవార్డు రేసులో ఉన్నాడు. జూలైలో సుందర్ బంతితో ఆకట్టుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో 8 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అలాగే, శ్రీలంకతో 3వ టీ20లో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో మొదట తన కోటాలో 2 వికెట్లు తీశాడు. అలాగే, సూపర్ ఓవర్‌కు దారితీసిన ఆ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వేసిన సుందర్ మూడు బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో జట్టు విజయం సునాయాసమైంది. సుందర్‌తోపాటు ఇంగ్లాండ్ బౌలర్ అట్కిన్సన్, స్కాట్లాండ్ బౌలర్ చార్లీ కాసెల్ అవార్డు కోసం పోటీపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed