‘ఆన్సర్ షీట్‌లో వంద నోటు పెట్టు..’

by Sumithra |
‘ఆన్సర్ షీట్‌లో వంద నోటు పెట్టు..’
X

బోర్డు ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులకు టీచర్లు, ప్రిన్సిపాళ్లు ఏ సలహాలు ఇస్తారు? ఏ జాగ్రత్తలు పాటించమని చెప్తారు? సాధారణంగానైతే.. ఇంపార్టెంట్ కొశ్చన్స్, టైమ్ అనుసరణ, సమాధానం రాయడంలో మెలకువలు వివరిస్తారు. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని ఓ స్కూల్ ప్రిన్సిపాల్ ఎలా కాపీ కొట్టాలో.. ఎలా ప్రలోభపెట్టాలో విద్యార్థులకు ‘బోధించి’ కటకటాలపాలయ్యాడు.

లక్నోకు 300 కిలోమీటర్ల దూరంలోని మావ్ జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు స్కూల్ మేనేజర్ కమ్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ మాల్.. విద్యార్థులకు కాపీ టిప్స్‌పై ఉచిత సలహాలిచ్చాడు. కంచె చేను మేసిన చందంగా కాపీ కొట్టడాన్ని ప్రోత్సహించి అండగా ఉంటానని మాటిచ్చాడు. ‘నేను చాలెంజ్ చేస్తున్నా.. నా విద్యార్థులెవరూ ఫెయిల్ కాబోరు. వారు దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. పరీక్షా కేంద్రంలో మీరు మీరు మాట్లాడుకోవచ్చు. కానీ, ఎక్కడివాళ్లు అక్కడే కూర్చుని ఆ పని చేయాలి. టెన్షన్ అక్కర్లేదు. మీ ఎగ్జామ్ సెంటర్ పడిన ప్రభుత్వ స్కూల్ టీచర్లు నా ఫ్రెండ్సే. ఒకవేళ మీరు దొరికితే మహా అయితే లెంపకాయలేస్తారేమో.. భయపడొద్దు. భరించండి. అలాగే, ఒక్క ప్రశ్నను కూడా ఖాళీగా వదిలిపెట్టొద్దు. ఆన్సర్ షీట్‌లో ఓ వంద నోట్ పెట్టండి. పేపర్ దిద్దే టీచర్ కళ్లు మూసుకుని మార్కులేస్తారు. నాలుగు మార్కులకు మూడు మార్కులైనా వేస్తారు’ అని బుద్ధి గడ్డి తిన్న ఆ మాస్టారూ.. విద్యార్థులకు ఇలాంటి టిప్స్ ఇచ్చాడు. అంతేనా, చివర్లో ‘జై హింద్, జై భారత్’ అని కూడా అన్నాడు.

ఈ తతంగాన్ని ఓ విద్యార్థి చాటుగా వీడియో తీసి సీఎం యోగి ఆదిత్యానాథ్ గ్రీవెన్స్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో ఆ ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. యూపీలో 10వ, 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ మంగళవారం మొదలయ్యాయి. గతంలో కంటే ఈ సారి పరీక్షా కేంద్రాల్లో మరిన్ని స్ట్రిక్ట్ నిబంధనలను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed