Wayanad :‘వయనాడ్’ విషాదం.. 333కు చేరిన మరణాలు

by Hajipasha |
Wayanad :‘వయనాడ్’ విషాదం.. 333కు చేరిన మరణాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ఉన్న చూరల్‌మల, అట్టామల, ముండక్కై, వెల్లారిమల గ్రామాలపై కొండచరియలు విరిగిపడి సృష్టించిన విలయం అంతాఇంతా కాదు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 333కు చేరింది. ఇంకా 281 మంది ఆచూకీ తెలియడం లేదు. వారి ఆచూకీని గుర్తించేందుకు ప్రభావిత ప్రాంతాలను ఆర్మీ, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, రెస్క్యూ టీమ్స్ అణువణువూ జల్లెడ పడుతున్నాయి. ఇందుకోసం థర్మల్ స్కానర్లను వినియోగిస్తున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కూలిపోయిన భవనాలు, శిథిలాలు, బురదరాశుల కింద ఎవరైనా చిక్కుకొని ఉంటే.. ఉచ్ఛ్వాసనిశ్వాసాల ఆధారంగా వారి జాడను గుర్తించేందుకు థర్మల్ స్కానర్లు ఉపయోగపడతాయని తెలిపాయి. థర్మల్ స్కానర్ ఇచ్చిన సిగ్నల్స్ ఆధారంగా ముండక్కై గ్రామంలో శిథిలాల కింద చిక్కుకున్న ఓ మహిళను రక్షించారు. నేలమట్టమైన ఇళ్ల శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడార్ సాంకేతికతను కూడా వాడుతున్నట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు రెస్క్యూ ఆపరేషన్‌లో దాదాపు వెయ్యి మందిని కాపాడినట్లు చెప్పాయి.

74 గుర్తుతెలియని మృతదేహాలకు ప్రభుత్వం అంత్యక్రియలు

వయనాడ్ జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్స్‌కు లభించిన 74 డెడ్‌బాడీస్‌‌ను ఇంకా ఎవరూ క్లెయిమ్ చేయలేదు. దీంతో వాటిని గుర్తుతెలియని డెడ్ బాడీస్‌గా పరిగణించి మెప్పాడి పంచాయతీలోని తాత్కాలిక మార్చురీలలో భద్రపరిచారు. మరో ఒకటి, రెండు రోజుల్లో ఎవరూ క్లెయిమ్ చేయకుంటే.. ఆ మృతదేహాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశాన్ని పర్యవేక్షించేందుకు ఒక నోడల్ అధికారిని నియమించారు.

కేరళకు రెడ్ అలెర్ట్

రాబోయే రెండు రోజుల్లో కేరళలోని వయనాడ్ సహా ఇతర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ఆయా ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఇక వయనాడ్ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపాన్ని తెలిపారు. సహాయకచర్యల్లో పాల్గొన్న వారి నిబద్ధతను, ధైర్యసాహసాలను కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed