Rahul Gandhi : నాన్న చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో ఇప్పుడంత బాధపడుతున్నా : రాహుల్ గాంధీ

by Hajipasha |
Rahul Gandhi : నాన్న చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో ఇప్పుడంత బాధపడుతున్నా : రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో : వయనాడ్‌ జిల్లాలోని చూర్లమల పట్టణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎమోషనల్ అయ్యారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను పరామర్శిస్తూ ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి రాజీవ్‌గాంధీని గుర్తు చేసుకుంటూ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మా నాన్న చనిపోయినప్పుడు నేను ఎలాంటి బాధను భావించానో.. ఈ రోజు మీ పరిస్థితిని చూసి అలాంటి బాధనే అనుభవిస్తున్నాను. మీ కష్టాన్ని నా కష్టంగానే భావిస్తున్నాను’’ అని ఆయన బాధిత కుటుంబీకులతో చెప్పారు. ‘‘ఆనాడు మా నాన్నను నేను కోల్పోయాను. ఈనాడు వయనాడ్ జిల్లాలోని బాధిత ప్రజలు కొండ చరియలు విరిగిపడిన ఘటనలో తమ యావత్ కుటుంబాలనే కోల్పోయారు. ఇది అత్యంత విషాదకరం’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘నేను ఒక్కడినే కాదు.. యావత్ దేశం వయనాడ్ ఘటన గురించి చాలా ఆవేదనను వ్యక్తం చేస్తోంది’’ అని ఆయన పేర్కొన్నారు.

విమ్స్, సహాయక శిబిరం సందర్శన

చూర్లమల పట్టణంలోని బాధిత కుటుంబాలను రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ కూడా పరామర్శించారు. అనంతరం వారు వయనాడ్‌లోని విమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వారిని కలిసి ఘటన గురించి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. వయనాడ్‌లోని సెయింట్ జోసెఫ్ అప్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరంలోని బాధిత కుటుంబాల వారితోనూ రాహుల్, ప్రియాంక మాట్లాడారు. వారి పునరావాసం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఆ విషాదాన్ని మాటల్లో చెప్పలేం : ప్రియాంకాగాంధీ

వయనాడ్‌లో చోటుచేసుకున్న విషాదాన్ని మాటల్లో చెప్పలేమని ప్రియాంకాగాంధీ అన్నారు. గురువారం రోజంతా తాము బాధిత కుటుంబాలతో మాట్లాడామని.. వారికి వచ్చిన కష్టం మరెవరికీ రాకూడదన్నారు. బాధిత కుటుంబాలు అనుభవిస్తున్న బాధను తాము అర్థం చేసుకోగలమని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనలో కన్నవారిని కోల్పోయి అనాథలుగా మారిన పిల్లల కోసం ఏం చేయాలనే దానిపై తాము శుక్రవారంలోగా ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రియాంక వెల్లడించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఇలాంటిదే ఓ విషాద ఘటన చోటుచేసుకుందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed