MODI: సింగపూర్‌లో సెమీకండక్టర్ కంపెనీని సందర్శించిన ప్రధాని మోడీ

by Harish |   ( Updated:2024-09-05 06:27:57.0  )
MODI: సింగపూర్‌లో సెమీకండక్టర్ కంపెనీని సందర్శించిన ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: సింగపూర్ పీఎం వాంగ్ ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటనకు అక్కడికి వెళ్లిన ప్రధాని మోడీ గురువారం ఉదయం సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రముఖ కంపెనీ అయిన AEM హోల్డింగ్స్ లిమిటెడ్‌ను సందర్శించారు. బుధవారం సింగపూర్‌కు చేరుకున్న మోడీ రెండో రోజు పీఎం వాంగ్‌‌తో కలిపి అత్యాధునిక సెమీకండక్టర్ కంపెనీని సందర్శించారు. ఇద్దరు నేతలు గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో కంపెనీ పాత్ర, దాని కార్యకలాపాలు, భారతదేశం కోసం ప్రణాళికల గురించి చర్చించుకున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. సింగపూర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ అక్కడి సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, భారత్‌తో సహకారానికి అవకాశాలపై ప్రధానికి వివరించింది.

సింగపూర్‌లో శిక్షణ పొందుతున్న భారతీయ ఇంటర్న్‌లతో పాటు CII-ఎంటర్‌ప్రైజ్ సింగపూర్ ఇండియా రెడీ టాలెంట్ ప్రోగ్రామ్ కింద భారతదేశాన్ని సందర్శించిన సింగపూర్ ఇంటర్న్‌లు, AEMలో పనిచేస్తున్న భారతీయ ఇంజనీర్‌లను మోడీ కలుసుకుని వారితో మాట్లాడారు. ఈ సందర్బంగా సెప్టెంబర్ 11-13, 2024 తేదీల్లో గ్రేటర్ నోయిడాలో జరగనున్న సెమికాన్ ఇండియా ఎగ్జిబిషన్‌లో పాల్గొనాల్సిందిగా సింగపూర్ సెమీకండక్టర్ కంపెనీలను ప్రధాని మోడీ ఆహ్వానించారు. సింగపూర్‌లో బాగా అభివృద్ధి చెందిన సెమీకండక్టర్ పరిశ్రమలు ఉన్నాయి. భారత్‌లో చిప్‌ల తయారీకి ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో రెండు స్నేహపూర్వక దేశాల మధ్య మెరుగైన వాణిజ్య అవకాశాల పరంగా సెమీకండక్టర్ పరిశ్రమకు ప్రధాని మోడీ పర్యటన ముఖ్యమైనది.

Advertisement

Next Story