Haryana: హర్యానాలో కాంగ్రెస్‌కే అత్యధిక సీట్లు: అజయ్ మాకెన్

by S Gopi |
Haryana: హర్యానాలో కాంగ్రెస్‌కే అత్యధిక సీట్లు: అజయ్ మాకెన్
X

దిశ, నేషనల్ బ్యూరో: రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి సిద్ధంగా ఉన్నామని, బీజేపీని ఓడించి తమ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ సీనియర్ పరిశీలకులుగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పార్టీ నాయకుడు అజయ్ మాకెన్, ప్రతాప్ సింగ్ బజ్వాలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నియమించినట్లు పార్టీ అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడిన అజయ్ మాకెన్.. రాష్ట్రంలో తమ పార్టీ సీట్ల సంఖ్యను పెంచుకునే లక్ష్యంతో వ్యూహాత్మక చర్చలు జరిపాం. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఏకైక పోటీ బీజేపీనే. ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరుకుంటున్నాం. ఇతర పార్టీలకు ఓటు వేస్తే అది బీజేపీకి ప్రయోజనం కలుగుతుంది. ఎవరైనా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకుంటే, కాంగ్రెస్‌కు ఓటు వేయాలన్నారు. బీజేపీని ఓడించగలిగేది కాంగ్రెస్ మాత్రమేనని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అజయ్ మాకెన్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో సీట్ల పంపకం కుదరకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలకు గానూ 89 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)కి ఒక స్థానాన్ని వదిలిపెట్టింది. హర్యానాలో అధికార బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోరు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి గత పదేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఈసారి ఆ పార్టీకి కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 10 స్థానాలకు గాను బీజేపీ, కాంగ్రెస్‌లు ఐదు స్థానాలను గెలుచుకున్నాయి.

Next Story

Most Viewed