Mahakumbamela: రేపటితో ముగియనున్న మహా కుంభమేళా.. ఆ ప్రాంతంలోకి వాహనాలు నిషేధం !

by vinod kumar |
Mahakumbamela: రేపటితో ముగియనున్న మహా కుంభమేళా.. ఆ ప్రాంతంలోకి వాహనాలు నిషేధం !
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayag raj) నగరంలో జరుగుతున్న మహాకుంభమేళా (Mahakumba mela) బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ముగియనుంది. కుంభమేళా చివరి రోజున భారీ సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చివరి అమృత్ స్నానానికి కోటి మందికి పైగా సందర్శకులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో భక్తుల రద్దీని ఎదుర్కోవడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. మంగళవారం సాయంత్రం నుంచే కుంభమేళా జరిగే ప్రాంతాన్ని నో వెహికిల్ జోన్‌గా మార్చింది. పాస్‌లు ఉన్న వాటిని మాత్రమే అనుమతించింది. జాతర ముగిసే వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. మహా కుంభమేళా ముగింపు, మహా శివరాత్రి సందర్భంగా, భద్రత, సౌకర్యాలు, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi aadityanath) అధికారులను ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

64 కోట్ల మంది పవిత్ర స్నానాలు

జాతర ముగియనుండటంతో కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. మంగళవారం ఒక్కరోజే 1.24 కోట్ల మంది త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు. దీంతో జాతర ప్రారంభమైన నాటి నుంచి 64.60 కోట్ల మంది భక్తులు స్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఇక, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ, నటులు రవీనా టాండన్, అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఒడిశా గవర్నర్ హరిబాబు బీజేపీ మాజీ నాయకురాలు నుపూర్ శర్మ సహా పలువురు ప్రముఖులు పవిత్ర స్నానం చేశారు.

కాగా, మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి 45 కోట్లకు పైగా భక్తులు వస్తారని ఉత్తరప్రదేశ్ అధికారులు అంచనా వేశారు. కానీ ఈ నెల 11 నాటికే మైలురాయిని చేరుకుంది. గత మూడు రోజుల్లో ఆ సంఖ్య 50 కోట్లు దాటింది. జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా మొదటి అమృత్ స్నాన్ నిర్వహించారు. మరోవైపు చివరి రోజున అయోధ్య, వారణాసిలను కూడా భక్తులు పెద్ద ఎత్తున సందర్శించే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.



Next Story

Most Viewed