Rahul Gandhi: దేశ రాజకీయాల్లో ప్రేమ, గౌరవం, వినయం మిస్ అయ్యాయి

by Shamantha N |
Rahul Gandhi: దేశ రాజకీయాల్లో ప్రేమ, గౌరవం, వినయం మిస్ అయ్యాయి
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత రాజకీయాలపై కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో ప్రేమ, గౌరవం, వినయం మిస్ అయ్యాయని అన్నారు. నాలుగురోజుల అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. టెక్సాస్‌లోని భారత-అమెరికన్‌ కమ్యూనిటీతో సంభాషించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలంపై ఆయన విమర్శలు గుప్పించారు. భారత్ అంటే ఒకటే ఆలోచన అని ఆర్ఎస్ఎస్(RSS) నమ్ముతుందని.. కానీ కాంగ్రెస్(Congress) మాత్రం బహుళ ఆలోచనలని విశ్వసిస్తుందన్నారు.

అమెరికాలో ఉన్నట్లే భారత్ లోనూ ఉండాలి

రాహుల్ మాట్లాడుతూ.. “అమెరికా (USA)లో ఉన్నట్లే.. దేశంలోనూ అందరికీ ప్రాతినిధ్యం ఉండాలని మేం కోరుకుంటాం. కులం, మతం, భాష, చరిత్ర, సంప్రదాయాలతో సంబంధం లేకుండా అందరూ కలలు కనేందుకు అర్హులే. కానీ, భారత్‌లో పరిస్థితి వేరుగా ఉంది. ఇప్పుడు వాటన్నింటి కోసం పోరాడాల్సి వస్తుంది. భారత ప్రధాని(PM Modi) రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని భారతదేశంలోని మిలియన్ల మంది ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజల పోరాటం ఏంటో అర్థమైంది.’’ అని అన్నారు. ‘‘ భారత రాజకీయ వ్యవస్థలో లేనిది ప్రేమ, గౌరవం, వినయం అని బావిస్తున్నా. రాజకీయ నేతలు కులం, మతం, భాషలు, రాష్ట్రాలకు ఇలా అన్నింటికి అతీతంగా అందరిపై ప్రేమ ఉండాలి. కేవలం శక్తిమంతులనే గాక, భారత్‌ను నిర్మించేందుకు ప్రయత్నించే అందరినీ గౌరవించాలి. వీటన్నిటిని రాజకీయాల్లో తిరిగి తీసుకొచ్చేందుకే నిరంతరం పనిచేస్తున్నా’’ అని రాహుల్‌ గాంధీ అన్నారు.

బీజేపీ అంటే భయం పోయింది

లోక్ సభ ఎన్నికలతోనే బీజేపీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థమైపోయిందని రాహుల్ అన్నారు. బీజేపీ అంటే భయం పోయిందని.. ఎన్నికల ఫలితాలు పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. దేశ సంప్రదాయాలు, భాషలపై బీజేపీ దాడి చేస్తోందని చాలా మంది చెప్పారని పేర్కొన్నారు. రాజ్యాంగంపై దాడిని ఎన్నటికీ అంగీకరించబోమని ప్రజలు స్పష్టంగా చెప్పారని రాహుల్‌ అన్నారు. భారత్‌ జోడో యాత్ర తనను ఎంతగానో మార్చిందని వెల్లడించారు. ఆ యాత్ర తర్వాత తన ఆలోచనా విధానం మారిపోయిందన్నారు. ప్రజలతో కొత్త బంధాలు ఏర్పరుచుకున్నానని అన్నారు. దానివల్లే రాజకీయాల్లో ప్రేమ అనే కొత్త చాప్టర్ ని తీసుకొచ్చామని తెలిపారు.

నిరుద్యోగ సమస్యపై రాహుల్ ఏమన్నారంటే?

భారత్- అమెరికా కమ్యూనిటీతో మాట్లాడకముందు టెక్సాస్‌ యూనివర్సిటీలో విద్యార్థులతో రాహుల్ భేటీ అయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ (Rahul Gandhi) ప్రసంగించారు. భారత్‌, అమెరికా సహా కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ అన్నింటిలో నిరుద్యోగ సమస్య ఉందని అన్నారు. ఆయా దేశాలను నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తోందని గుర్తుచేశారు. కానీ, చైనాలో మాత్రం అలాంటి ఇబ్బంది అస్సలు లేదన్నారు. దానికి కారణం, ఉత్పత్తి రంగంలో చైనా ఆధిపత్యమే కారణం అని తెలిపారు. తయారీ రంగంపై భారత్ మరింత దృష్టి సారించాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed