Himachal cloudbursts: ప్రకృతి విపత్తులతో హిమాచల్ అస్తవ్యస్తం.. ఐదుగురు మృతి, 50 మంది గల్లంతు

by Shamantha N |
Himachal cloudbursts: ప్రకృతి విపత్తులతో హిమాచల్ అస్తవ్యస్తం.. ఐదుగురు మృతి, 50 మంది గల్లంతు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రకృతి విపత్తులతో హిమాచల్ ప్రదేశ్ అస్తవ్యస్తంగా మారింది. ఆ రాష్ట్రాని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వర్షాలు, వరదల వల్ల ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు. మరో 50 మంది గల్లంతయ్యారు. మండి, సిమ్లా, కులు జిల్లాల్లో భారీవర్షాలకు 50 మంది గల్లంతవ్వగా, రెండు డెడ్ బాడీలు లభ్యమయ్యాయి. సహాయక చర్యల కోసం ఆర్మీ రంగంలోకి దిగింది. మొత్తం 125 మంది సిబ్బంది, 20 మంది సిబ్బందితో ఇంజినీర్ టాస్క్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. హిమాచల్ పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ నిశితంగా పరిశీలిస్తున్నారని ఉన్నాతాధికారులు తెలిపారు. బాధితులకు అన్ని విధాలా సహాయం అందేలా చూడాలని మోడీ ఆదేశించినట్లు వెల్లడించారు. మరోవైపు, వరదపరిస్థితిపై హిమాచల్ ప్రదేశ్ సిఎం సుఖ్విందర్ సింగ్ సుఖు స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని విధాలా సహాయం చేస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. రెండు అదనపు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను పంపుతున్నట్లు ప్రకటించారని తెలిపారు. బీజేపీ చీఫ్ నడ్డా కూడా రెండుసార్లు ఫోన్ చేశారుని వెల్లడించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీతో కూడా వరద పరిస్థితిపై మాట్లాడినట్లు తెలిపారు.

జిల్లాలకు రెడ్ అలెర్ట్

హిమాచల్ ప్రదేశ్‌ లోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కాంగ్రా, కులు, మండి, సిమ్లా, చంబా, సిర్మౌర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రెడ్ అలెర్ట్ ప్రకటించింది. రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించినట్లు హిమాచల్ ప్రదేశ్ అదనపు చీఫ్ సెక్రటరీ ఓంకార్ చంద్ శర్మ తెలిపారు. ఇకపోతే, హిమాచల్ లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. పాలంపూర్‌లో అత్యధికంగా 212 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చౌరిలో 203, ధర్మశాలలో 183.2, జోగిందర్‌నగర్‌లో 161, కాంగ్రాలో 150 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


Advertisement

Next Story