Haryana Elections: హర్యానాలో కాంగ్రెస్ మేనిఫెస్టో.. ఏడు కీలక హామీలు ఇవే?

by vinod kumar |
Haryana Elections: హర్యానాలో కాంగ్రెస్ మేనిఫెస్టో.. ఏడు కీలక హామీలు ఇవే?
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ బుధవారం రిలీజ్ చేసింది. ‘సాత్‌ వాదే పక్కే ఇరదే’ పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హర్యానా కాంగ్రెస్ యూనిట్‌తో కలిసి పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విడుదల చేశారు. ఇందులో ఏడు కీలక హామీలను ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే..18 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు ప్రతి నెలా రూ.2000 అందజేస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ. 6,000 పెన్షన్ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎంఎస్‌పీ గ్యారెంటీ చట్టంతోపాటు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని పేర్కొంది.

ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని వెల్లడించింది. అంతేగాక రూ.25లక్షల వరకు ఉచిత వైద్యం, రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. పేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు 100 గజాల ప్లాట్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చేపడతామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. ఇంకా చాలా వాగ్దానాలు ఉన్నాయని వాటిని చండీగఢ్‌లో విడుదల చేస్తామన్నారు. 53 పేజీలతో మేనిఫెస్టో ఉందని దానిని సైతం త్వరలోనే రిలీజ్ చేస్తామని వెల్లడించారు.

కాంగ్రెస్ హయాంలో హర్యానా అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా ఉందని హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ అన్నారు. బీజేపీ పాలనలో నేరాలకు కేంద్రంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. కాగా, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు గాను అక్టోబర్ 5న ఓటింగ్ జరగనుండగా, 8న పోలింగ్ జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed