ఉచిత విద్యుత్, మహిళలకు నెలకు రూ.1000.. హర్యానాలో ఆప్ మేనిఫెస్టో రిలీజ్

by vinod kumar |
ఉచిత విద్యుత్, మహిళలకు నెలకు రూ.1000.. హర్యానాలో ఆప్ మేనిఫెస్టో రిలీజ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది చివరలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తన మేనిఫోస్టోను శనివారం విడుదల చేసింది. ‘కేజ్రీవాల్ కి గ్యారంటీ’ పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను రాష్ట్రంలోని పంచకులలో నిర్వహించిన సమావేశంలో కేజ్రీవాల్ సతీమని సునీతా కేజ్రీవాల్ రిలీజ్ చేశారు. అందులో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, ఉచిత వైద్యం, పిల్లలకు నాణ్యమైన విద్య, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.1000 వంటి హామీలు ఉన్నాయి. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ..ఢిల్లీ, పంజాబ్‌లలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. మొహల్లా క్లినిక్‌ లు ప్రారంభించామని, ప్రభుత్వం పాఠశాలలను ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు.

‘కేజ్రీవాల్ హర్యానాలోని హిసార్‌లోనే పెరిగాడు. ఆయన దేశ రాజధానిని పరిపాలిస్తాడని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. కానీ ఒక గొప్ప విజయం సాధించి ఢిల్లీని పాలిస్తున్నారు. ఇదొక అద్భుతం. తన సొంత పార్టీని స్థాపించి, దేశమంతటా ఎవరూ చేయలేని పనులు చేశారు. కేజ్రీవాల్ పనిని గుర్తించండి’ అని వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీని రాష్ట్రంలో ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పాల్గొన్నారు. కాగా, ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగుతామని ప్రకటించిన విషయం తెలిసిందే.



Next Story