Imran Khan: పాక్ మాజీ ప్రధానికి ఇమ్రాన్ ఖాన్ కు షాక్.. 14 ఏళ్ల జైలుశిక్ష

by Shamantha N |
Imran Khan: పాక్ మాజీ ప్రధానికి ఇమ్రాన్ ఖాన్ కు షాక్.. 14 ఏళ్ల జైలుశిక్ష
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ (Imran Khan)కు మరో గట్టి షాక్ తగిలింది. ఆల్‌ ఖాదిర్ కేసులో ఇమ్రాన్ ఖాన్ ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్ తో పాటు ఆయన భార్య బుష్రా బీబీని కూడా దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అడియాలా జైలులో కట్టుదిట్టమైన భద్రత నడుమ న్యాయమూర్తి తుదితీర్పు వెల్లడించారు. ఇమ్రాన్‌, బుష్రాలకు 10 లక్షలు, 5 లక్షల పాకిస్థానీ రూపాయల జరిమానా విధించారు.

అసలు కేసు ఏంటంటే?

2023లో ఇమ్రాన్ (Imran Khan) దంపతులతో పాటు మరో ఆరుగురిపైనా నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో(NAB) అల్‌ఖాదిర్‌ ట్రస్టు కేసు నమోదుచేసింది. ఇమ్రాన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు బ్రిటన్‌ నుంచి 19 కోట్ల పౌండ్లు పాక్ కు అందాయి. లండన్‌లో ఉంటున్న పాక్‌ స్థిరాస్తి వ్యాపారి మాలిక్‌ రియాజ్‌ హుసేన్‌ నుంచి వసూలుచేసిన 19 కోట్ల పౌండ్లను బ్రిటన్‌ పాక్‌కు పంపింది. అయితే, బ్రిటన్ నుంచి జాతీయ ఖజానాలో జమ చేయకుండా ఇమ్రాన్ ఖాన్ వాడుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గతంలో రియాజ్‌హుసేన్‌కు విధించిన జరిమానాలో కొంత మొత్తాన్ని ఆ నగదులో నుంచి కట్టడానికి అనుమతించారని తెలిపారు. దీనికి బదులుగా ఇమ్రాన్‌ దంపతుల ట్రస్టు ఏర్పాటు చేయాలనుకున్న అల్‌ఖాదిర్‌ విశ్వవిద్యాలయానికి హుసేన్‌ 57 ఎకరాలను బహుమానంగా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇకపోతే, ఆగస్టు 2023 నుంచి ఇమ్రాన్ ఖాన్‌ జైళ్లోనే ఉంటున్నారు. ఆయనపై సుమారు 200కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇకపోతే, ఇటీవల తనపై ఉన్న జైలు శిక్ష సస్పెండ్ కావడంతో బుష్రాబీబీ ప్రస్తుతం బయటే ఉన్నారు.



Next Story