9 రోజుల్లో.. ఆ గ్రామస్తులు వంతెన నిర్మించారు

by Shyam |
9 రోజుల్లో.. ఆ గ్రామస్తులు వంతెన నిర్మించారు
X

దిశ, వెబ్‌డెస్క్: మనదేశంలో ప్రభుత్వాలు మారుతున్నా, అధికారం మారుతున్నా.. కొన్ని మారుమూల గ్రామాల్లోని ప్రజల తలరాత మాత్రం మారడం లేదు. ఇప్పటికీ ఎన్నో గ్రామాల్లో విద్యుత్ వెలుగులు, సరైన రోడ్డు మార్గాలు లేవు, ఆస్పత్రులు అసలే కానరావు. ఇంకా కొన్ని గ్రామాలకు వెళ్లాలంటే కాలువలు లేదా చెరువులను ఈదుకుంటూ వెళ్లాల్సిందే. మహారాష్ట్ర, యవత్మాల్‌ జిల్లాలోని పల్సీ గ్రామస్తులు కూడా పెన్‌గంగా నది వల్ల ఎన్నో ఏళ్లుగా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ బాధను ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం మాత్రం శూన్యం. దాంతో ఆ గ్రామస్తులంతా కలిసి చేసిన ఓ పనికి ప్రభుత్వం, రాజకీయ నేతలు సిగ్గుపడుతున్నారు. ఇంతకీ వారు ఏం చేశారంటే?

రాజకీయ నాయకులు హామీలు ఇస్తారు కానీ, నెరవేర్చలేరని మరోసారి పల్సీ గ్రామస్తులకు అర్థమైంది. బ్రిడ్జి నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఆఫీసులు, ఎంఎల్ఏ, ఎంపీ, మహారాష్ట్ర మినిస్టర్స్, కలెక్టర్లతో పాటు వివిధ నేతల చుట్టూ తిరిగి విసిగిపోయిన గ్రామస్తులు.. తామే స్వయంగా వంతెన నిర్మించుకుని ప్రభుత్వాధికారులు, రాజకీయ నేతలు సిగ్గుపడేలా చేశారు. గ్రామస్తులంతా ఒక్కటై విరాళాలు వేసుకుని, పాల్సీ-మనులాలను కలుపుతూ 70 అడుగుల పొడవైన వంతెనను కేవలం తొమ్మిది రోజుల్లోనే నిర్మించి ఔరా అనిపించారు. ఆ వంతెన నిర్మాణంతో పల్సీ, పొఫాలి, కుప్తి, మాలువా మానులా, మాథాలా, సిరాద్ గ్రామాల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. కాగా బ్రిడ్జి నిర్మాణం తర్వాత ఎంపీ హింగోళి హేమంత్ పాటిల్, ఎంఎల్ఏ నామ్‌దేవ్ రావు ససానే, రాజకీయ నాయకుడు మాధరావు పాటిల్‌ ఆ వంతెనను సందర్శించి పల్సీ గ్రామ ప్రజల సంకల్పానికి అభినందనలు తెలియజేశారు. అంతేకాదు ఈ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ. కోటి అంచనా వేయగా, గ్రామస్తులు కేవలం రూ. 15.80 లక్షలకే నిర్మించడం గమనార్హం.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed