కర్మయోగికి 74వ జన్మదిన శుభాకాంక్షలు

by Bhoopathi Nagaiah |
కర్మయోగికి 74వ జన్మదిన శుభాకాంక్షలు
X

"ఉక్కు నరాలు, తెలివైన బుద్ధి ఉంటే లోకమంతా నీకు పాలక్రాంతమవుతుంది" అని స్వామి వివేకానంద అంటారు. ఈ స్ఫూర్తి మంత్రాన్ని మనసా-వాచా పాటించి యువతకు గొప్ప సందేశాన్ని ఇవ్వడం ద్వారా నరేంద్రమోడీ బహుళ జనాదరణ పొందారు. ఇవాళ నరేంద్రమోడీ అనే పేరు తెలియని వారు ప్రపంచంలోనే ఉండరు అంటే అతిశయోక్తి కాదు. రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణం, ద్వారకాలో స్కై డైవ్, లక్షద్వీప్‌ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా చేయడం. జి20 సదస్సులను విజయవంతంగా నిర్వహించడం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతింప చేసే ప్రయత్నం.. మోడీ సాధించిన అపూర్వ విజయాల్లో ఇవి కొన్ని మాత్రమే. నేడు నరేంద్ర మోడీ 74వ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత విశేషాలపై కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం..

వ్యక్తిగత సమాచారం

1950 సెప్టెంబర్ 17న గుజరాత్ లోని వాద్ నగర్‌లో నరేంద్ర మోడీ జన్మించారు. అంటే సరిగ్గా తెలంగాణకు నిజాం నుండి విమోచనం వచ్చిన రోజు అన్నమాట. వీరి తల్లిదండ్రులు దామోదర్ దాస్ మూల్ చంద్ మోదీ, హిరాబెన్ మోదీ వీరికి మొత్తం ఆరుగురు సంతానం. అందులో మూడవ సంతానం నరేంద్ర మోదీ. తన బాల్యం నుండే ఆధ్యాత్మిక చింతనలు కలిగి ఉండేవాడు. 8 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లోకి ప్రవేశించాడు. 1971లో అధికారికంగా ఆర్ఎస్ఎస్ సభ్యునిగా బాధ్యతలు అందుకున్నారు.

రాజకీయ ప్రవేశం

1986లో ఆర్ఎస్ఎస్ నుండి బీజేపీలోకి ప్రవేశించిన మొదటి తరం నాయకుల్లో మోడీ ఒకరు. 1990లో లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు బాధ్యతలు నిర్వహించారు. 1992లో మురళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి నుండి కాశ్మీర్ ఏక్తా రథయాత్రకు జాతీయ ఇన్చార్జిగా పని చేశారు. 1997 అద్వానీ చేపట్టిన "స్వర్ణ జయన్త రథయాత్ర" నిర్వహణ బాధ్యతలు తీసుకొని విజయవంతం చేశారు. 1998లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్న కుష్బూ తాక్రే ప్రోద్బలంతో మోడీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 1998-99 లలో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 1998లోనే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయతీరాలకు చేర్చాడు. అప్పుడు పార్టీలో సీనియర్ నాయకుడైన కేశుబాయి పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. 2000 సంవత్సరంలో గుజరాత్ లోని కుచ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఆ సమయంలో సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశుబాయి పటేల్ ప్రభుత్వం ప్రభుత్వం విఫలమయ్యిందని ప్రతిపక్షాలు విమర్శించడంతో బిజెపి నాయకత్వం 2001 అక్టోబర్ లో మోడీని గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమించారు. అప్పటి నుండి 2014 మే 21 నాడు ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసే వరకు నాలుగు దఫాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకురావడం జరిగింది. 2014 మే 26న నరేంద్ర మోడీ భారతదేశ 15వ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రధానిగా చరిత్ర నిర్ణయాలు.

భారతదేశంలో ప్రధానిగా నరేంద్ర మోడీ పలు చారిత్రాత్మక నిర్ణయాలు విధివిధానాలు అమలు చేశారు. వాటిలో ముఖ్యమైనవి 500,1000 రూపాయల నోట్లు రద్దు చేశారు. జిఎస్టి (గూడ్స్ మరియు సర్వీస్ టాక్స్)ని అమలు చేశారు. కాశ్మీర్‌కు సంబంధించిన అధికరణ 370ని రద్దుచేసి భారత యూనియన్‌లో కలపడం జరిగింది. ముస్లిం మహిళలకు ఊరట కల్పిస్తూ త్రిబుల్ తలాక్‌ను రద్దు చేశారు అలాగే పౌరసత్వ సవరణ బిల్లు (సిఎఎ) ప్రవేశపెట్టారు జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్‌సి) వంటి బిల్లులు అమలు చేశారు.

పురస్కారాలు విజయాలు

ఇన్ని గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్న మోడీకి పురస్కారాలకు కొదవలేదు. ప్రముఖ ఇంగ్లీష్ మీడియా సంస్థ "ఇండియా టుడే" సర్వే ప్రకారం 2007లో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు. 2014వ సంవత్సరంలో "సిఎన్ఎన్-ఐబిఎన్ నెట్వర్క్" చేతుల మీదుగా ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు. అంతేకాక 2014-15,17 సంవత్సరాలకు గాను "టైం" మ్యాగజిన్ గణనాల ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన వంద మంది వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. 2014వ సంవత్సరంలో "ఫోబ్స్" మ్యాగజైన్ ప్రకారం 15వ అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా స్థానం దక్కించుకున్నారు. "షార్ట్యూన్ మ్యాగజైన్" వార్షికంగా నిర్వహించే ప్రపంచంలోనే గొప్ప నాయకుల జాబితాలో 5స్థానం దక్కించుకున్నారు. మోదీ నాయకత్వంలో భారతదేశం దినదినాభివృద్ధి చెందుతూ 2018కి వ్యాపార రంగంలో వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం 100వ ర్యాంకును దక్కించుకుంది. నరేంద్ర మోడీకి తొలి "ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్" అవార్డు లభించింది(న్యూఢిల్లీ 2019 జనవరి 14). విశిష్ట లక్షణాలతో దేశాన్ని నడిపిస్తున్నందుకుగాను మోడీకి ఈ పురస్కారం దక్కింది. లెజెండరీ సింగర్ లతామంగేష్కర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన తొలి స్మారక అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2022 ఏప్రిల్ 24న ముంబైలో స్వీకరించారు. భారతదేశానికి నిస్వార్ధ సేవలు అందించినందుకు గాను ఆయనకి ఈ అవార్డు ప్రధానం చేశారు.

మోడీపై యువతకు ఇంత ఆదరణ...ఎందుకు.?

స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవడానికి ఇష్టపడతాను అని మోడీ కొన్ని సందర్భాల్లో తెలపడం జరిగింది. "ఉక్కు నరాలు, తెలివైన బుద్ధి ఉంటే లోకమంతా నీకు పాలక్రాంతంమవుతుంది" అని స్వామి వివేకానంద అంటారు. ఈ స్ఫూర్తి మంత్రాన్ని మనసా-వాచా పాటించి యువకులకు గొప్ప సందేశాన్ని ఇవ్వడం ద్వారా నరేంద్రమోడీకి ఇంత గొప్ప ఆదరణ లభిస్తుంది అని మనం చెప్పవచ్చు. యువతకు సంబంధించిన కొన్ని స్కిల్ డెవలప్మెంట్ పథకాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం ద్వారా ఎంతో మంది యువతీ యువకులు తన సొంత కాళ్లపై నిలబడి స్టార్ట్ అప్‌లు పెట్టుకోవడం జరుగుతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మహిళలకు ఎన్నో ఉపయోగాలు చేకూర్చడం జరిగింది. మోడీ ప్రధానమంత్రి అయినప్పటినుండి ఇప్పటివరకు పార్టీ అంత్యోదయ సిద్ధాంతానికి అనుకూలంగా పనిచేస్తూ పార్టీ సర్వ వ్యాప్తి సర్వస్పృశి అన్న విధంగా అన్ని వర్గాల వారిని తన మంత్రి వర్గంలో నియమించుకొని దేశాన్ని సమున్నత స్థానంలో ప్రపంచ దేశాల ముందు ఉంచడంలో విజయం సాధించారు. రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణం, ద్వారకాలో స్కై డైవ్, లక్షద్వీప్‌ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా చేయడం. జి20 సదస్సులను విజయవంతంగా నిర్వహించడం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతింప చేసే ప్రయత్నం... మోడీ నేతృత్వంలో భారత్ విజయపరంపర ఇంకా ఇంకా కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు...!

(నేడు నరేంద్ర మోడీ 74వ పుట్టినరోజు సందర్భంగా)

- సెవెళ్ళ మహేందర్

బీజేవైఎమ్ రాష్ట్ర అధ్యక్షులు

Advertisement

Next Story

Most Viewed