దూసుకుపోతున్నాం... కానీ గిట్టుబాటు ధర లేదు

by Ravi |   ( Updated:2024-03-12 01:00:29.0  )
దూసుకుపోతున్నాం... కానీ గిట్టుబాటు ధర లేదు
X

ప్రపంచదేశాలకు శ్రీరాముని పరిచయం చేస్తున్నారు మన పాలకులు. సరే.. కానీ నూటికి డెబ్బై శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారు పండించిన పంటలకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించకలేకపోయినప్పుడు స్వతంత్ర భారతమని చెప్పుకోవడానికి ప్రజలకు విశ్వాసం కలుగుతుందా? ఆజాదికా అమృత్ మహోత్సవాల భారతంలో నాగరికతకు పునాది అయిన వ్యవసాయం చేస్తున్న నిరుపేద రైతుల కడుపులు నిండక ఆకలితో కాలుతున్నప్పుడు, కాళీ కడుపులకు భరోసా అందించలేని రాజ్యం కూడా ఒక రాజ్యమేనా?

మానవ నాగరికతకు పునాది ఉత్పత్తి విధానం అందులో వ్యవసాయం ప్రధానమైనది. వ్యవసాయం పరిచయమైన సమాజం మానవ నాగరికత అభివృద్ధిని ముందుకు తీసుపోవడానికి తోడ్పడ్డది. ప్రకృతిలో లభ్యమయ్యే పండ్లు, ఫళాలు ఎలా లభ్యమయితే అలా తిని బ్రతికిన మానవులు ప్రకృతిపై మానవ శ్రమతో యుద్ధం చేసి వ్యవసాయం నేర్చుకొని జంతుస్థాయిగా ఉన్న మానవుడు వ్యవసాయం నేర్చుకోవడం ద్వారా ఉత్పత్తులను సృష్టించి ఆధునిక మానవులుగా మారగలిగారు. యంత్రం లేని సమాజం మొత్తంలో మానవులు జీవించింది వ్యక్తిగత ఆస్తులు లేని నిరుపేద కూలీల వ్యవసాయ శ్రమలతోనే.

ప్రపంచదేశాలకు శ్రీరాముని పరిచయం చేస్తున్న పాలకులు నూటికి డెబ్బై శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేక పోయినప్పుడు స్వతంత్ర భారతమని చెప్పుకోవడానికి ప్రజలకు విశ్వాసం కలుగుతుందా. ఆజాదీకా అమృత్ మహోత్సవాల భారతంలో నాగరికతకు పునాది అయిన వ్యవసాయం చేస్తున్న నిరుపేద రైతుల కడుపులు నిండక ఆకలితో కాలుతున్నప్పుడు, కాళీ కడుపులకు భరోసా అందించలేని రాజ్యం కూడా ఒక రాజ్యమేనా?

రైతులకు రాజధాని ప్రవేశం లేదు

అన్నమో రామచంద్ర అంటూ ఢిల్లీ చేరుతున్న రైతులకు రక్షణ ఎవరు రాముడు పాలకుల వైపు నిలబడ్డాడు కానీ ప్రజల వైపు కాదు. రామరాజ్యం నిర్మించాలనుకుంటున్న పాలకులకు రామరాజ్యంలో ప్రజలకు కనీస ప్రాథమిక హక్కులు లేవని నిరూపిస్తున్నారు. ప్రజాస్వామ్య భారతంలో రాజధాని నగరానికి ప్రజలకు ప్రవేశం లేదు. ప్రజల చెమట చుక్కలతో కట్టిన పన్నులతో వేసిన రోడ్లన్నీ వ్యాపారస్తులూ, బడా వ్యాపారస్తులు తిరగడానికే గానీ ఆ రోడ్లపై నుండి ప్రజలు ఢిల్లీ రావాలంటే మాత్రం బారికేడ్లు, భాష్పవాయువు ప్రయోగాలూ, పోలీసుల బందోబస్తులూ చేస్తున్నారు. ప్రజలను కాపాడడానికి ఉన్న రక్షణ వ్యవస్థ మొత్తం పాలకుల వైపు నిలబడినప్పుడు, విదేశీ శత్రువులపై ఎక్కు పెట్టాల్సిన తుపాకులు ప్రజలపై ఎక్కుపెడుతున్నప్పుడు మనది నిజంగా ప్రజాస్వామ్యమేనా.

ప్రజల పక్షమా, కార్పొరేట్ పక్షమా?

అలసిన బతుకులు ఆకలి కోసం పండించిన పంటలకు కనీస మద్దతు కోసం ఆరాటపడుతున్న ఆకలి భారతంలో, ఆసియాలోనే కాకుండా ప్రపంచ ధనవంతుల జాబితాలో పోటీపడుతున్న బిలియనీర్లు పుట్టుకొస్తున్న భారతంలో పాలకులు ప్రజల పక్షం నిలబడ్డారా లేక కార్పొరేట్ పక్షం నిలబడ్డారా అనేది దేశ ప్రజలు గమనించవలసిన అవసరం ఉన్నది. ప్రపంచ అభివృద్ధిలో భారత్ దూసుకుపోతున్న వేళ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించని సందర్భాలు ఉంటాయా? మనది ఎంత ఆశ్చర్యకరమైన అభివృద్ధి ఈ నేపథ్యంలోనే భారతదేశ అభివృద్ధి గురించి చేస్తున్న అంకెల గారడీ ప్రకటనలు చూస్తే నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉన్నది.

న్యాయమైన పోరాటానికి మద్దతు

ఈశాన్య రాష్ట్రాల హక్కుల కాలరాతలు, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కోసం ఉద్యమాలు, ఆకలి కేకలు, ఈ దేశ మెజారిటీ ప్రజలైన వెనకబడిన తరగతులకు కుల గణన నినాదాలు, రాజకీయ ప్రాతినిధ్య పోరాటాలు. ఆదివాసీల ఆత్మగౌరవ పోరాటాలు... మరోవైపు. సగటు మనిషి సమానమైన పనికి సమాన వేతనం కోసం కోర్టు చుట్టూ తిరగడాలు. నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు అత్మ బలిదానాలు. మానవ శ్రమే ప్రపంచ అభివృద్ధి. ప్రజలే ప్రపంచ నిర్మాతలు. భారత రైతులు పండించిన పంటల గిట్టుబాటు ధరల కోరకు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మద్దతుగా నిలుధ్దాం.

గుండమల్ల సత్యనారాయణ

89199 98619

Advertisement

Next Story

Most Viewed