గుడ్డలూడదీసి గోచీలివ్వడమెందుకు..

by Ravi |   ( Updated:2025-04-02 00:45:43.0  )
గుడ్డలూడదీసి గోచీలివ్వడమెందుకు..
X

It's not good to make people happy with freebies!కాలే కడుపులకి మూలకారణం తెలియని ఓటరు జనసామాన్యం ఉచితాల ఉట్టియే‌ జీవన స్వర్గానికి నిచ్చెనని భ్రమ పడుతుంటారు. ఈ మూర్ఖత్వం సొమ్ము చేసుకోవడం వంటపట్టిన రాజకీయ పక్షాలు ఉచితాలు ప్రకటిస్తూనే ఉంటాయి. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో కూడా ఉచితాల ప్రతిపాదన ఉంది. తద్వారా సమన్యాయం, ధర్మం సాధించడం ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి ప్రకటించారు. లక్ష్యం మంచిదే కానీ మార్గం ఇది కాదన్నది మాత్రం తేట తెల్లమే. ఉచితాలకు బదులు పన్నులు కొంత మేర తగ్గిస్తే గ్రామీణ ఉపాధి పథకం కింద చెల్లించే దినసరి వేతనం పెంచవచ్చు. సమస్త ఉపాధులకు చట్టాలు నిర్దేశించిన కనీసం వేతనం పెంచవచ్చు. ఇలా చేయ డం ద్వారా ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బు ఉంచవచ్చు.

దినసరి కూలీ పెంచాలని చెప్పినా..

గ్రామీణ పేదరిక నిర్మూలనకు ఉద్దేశించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం రూ.9,754 కోట్ల లోటుతో నడుస్తున్నప్పటికీ, 2025-26 బడ్జెట్‌లో గత సంవత్సరంలో వలె ఈ పథకానికి రూ.86,000 కోట్లు మాత్రమే కేటాయించారు. కానీ నిజానికి, ఈ మంత్రిత్వశాఖ పనితీరును సమీక్షించిన పార్లమెంటరీ‌ ప్యానెల్‌, గత డిసెంబర్‌‌లో ఈ వేతనాలను ద్రవ్యోల్బణంతో అనుసంధానించాలని, రాష్ట్రాల మధ్య వేతనాల‌ అంతరాలను తొలగించాలని, పని దినాలను 100 నుంచి 150కి పెంచాలని సిఫార్సు చేసింది. పురుషులతో సమానంగా మహిళలకీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కూడా నిర్దేశించినదని గుర్తు చేసింది. అలాగే అనూప్ సత్పతి నేతృత్వంలోని నిపుణుల కమిటీ 2019లో విడుదల చేసిన నివేదికలో‌ ఈ పథకం కింద దినసరి వేతనం రూ.375 ఉండాలన్న సిఫార్సు బుట్ట దాఖలైంది. అయితే ద్రవ్యోల్బణ సూచిక గణనలోకి తీసుకుని పార్లమెంట్ సభ్యులకు రూ.1,02,000 ఉండే నెల వారీ జీతభత్యాలను రూ.1,26,500కు పెంచింది.‌ ఈ విధానమే ఈ పథకానికి పాటిస్తే ఉపాధి హమీ కార్మి కుల కనీస దిన వేతనం రూ.574కి చేరి ఉండొచ్చు.

ఉచితాలతో సరిపెడితే..

కడుపునింపని కనీస వేతన చట్టం కింద నిర్ణయించబడ్డ వేతనాలు 1.10.24 నాటికి తెలంగాణలో రూ.12,398 నుండి రూ. 22,415 వరకు, ఆంధ్ర ప్రదేశ్‌లో రూ.11,798 నుండి రూ. 15,951 వరకు ఉన్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులలో, వైద్యశాలలలో, బడాబడా షాపింగ్ మాల్స్‌లో, బహుళజాతి సంస్థల ఉత్పత్తుల షో రూమ్స్‌లో పనిచేసే ఉద్యోగులకు నిర్ణయించిన గరిష్ట నెల జీతం వేతనం రూ.14,467. గత డిసెంబర్‌లో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం భవన, ఇతర నిర్మాణ కార్మికుల చట్టం అనుసరించి, యాజమాన్యల నుండి సెస్ రూపంలో వసూలు చేసిన రూ.1,17,507.22 కోట్లలో కేవలం రూ..67,669.92 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ రంగంలోని కార్మికులలో అత్యధికులకు ఆ చట్టం గురించే తెలియదు. తెలియజెప్పే నాధులూ లేరు. ఇక సామాజిక భద్రత చట్టాలు చాలా సంస్థల్లో పాక్షికంగా అమలు జరగడం, కొన్ని సంస్థలలో అసలుకే మోసం ఉండడం, ఇటీవల పెద్దలు కోరుకుంటున్నట్టుగా, కార్మిక వర్గంలో అధిక శాతం తరాలుగా 12 గంటల పని దిన భారం మోస్తున్నది జగద్విదితం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగనిచ్చి ఉచితాల తాయిలాలతో సరిపెట్టడం గుడ్డలూడదీసి గోచీలివ్వడమే..

- మల్లాప్రగడ రామారావు

99898 63398

Next Story