దిశ ఎఫెక్ట్: వృద్ధ దంపతుల పరిస్థితిపై కలెక్టర్ సీరియస్

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్: వృద్ధ దంపతుల పరిస్థితిపై కలెక్టర్ సీరియస్
X

దిశ, కామారెడ్డి: దిశ పత్రికలో శనివారం వచ్చిన ‘చిల్లిగవ్వ లేదు చికిత్స చేసేవారు లేరు’ కథనంపై జిల్లా కలెక్టర్ శరత్ స్పందించారు. అధికారులకు ఫోన్ చేసి దిశలో వచ్చిన కథనంలో వృద్ధ దంపతుల పరిస్థితిపై పూర్తి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం నుంచి ఎవరు పట్టించుకోకపోవడంపై అధికారులపై సీరియస్ అయ్యారు. ఆస్పత్రికి వెళ్లి వృద్ధ దంపతుల పూర్తి వివరాలు తీసుకుని చికిత్స అందేలా చూడాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాలతో ఐసిడిఎస్ సిబ్బంది ఆఘమేఘాలపై జిల్లా ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించే ప్రయత్నం చేయగా వృద్ధ దంపతులైన నారాయణ, లక్ష్మిలు ఆస్పత్రిలో కనిపించలేదు.

దంపతులిద్దరూ ఉదయం వరకు ఆస్పత్రిలోనే ఉన్నారని, మధ్యాహ్నం అధికారులు వెళ్ళేసరికి వెళ్లిపోయారని తెలిసింది. ఈ విషయమై ఐసిడిఎస్ అధికారులను ఫోన్ లో వివరణ కోరగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆస్పత్రికి వెళ్లామని, అక్కడికి వెళ్ళేసరికి దంపతులు లేరని తెలిపారు. వృద్దులిద్దరు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన వారని, జిల్లా వాసులు కారని చెప్పారు. ఇదే విషయాన్ని కలెక్టర్ కు నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed