మార్కెట్‌లో డీఐజీ రంగనాథ్ ఆకస్మిక తనిఖీ.. నిర్వాహకులకు హెచ్చరిక

by Shyam |
DIG Ranganath
X

దిశ, నల్లగొండ: కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా కూరగాయల మార్కెట్లను విశాలమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని డీఐజీ ఏవీ రంగనాథ్ చెప్పారు. గురువారం నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూరగాయల వ్యాపారులతో, వినియోగదారులతో ఆయన మాట్లాడారు. అనంతరం మార్కెట్ వ్యాపారులు, అసోసియేషన్ అధ్యకుడు సోమయ్యతో మాట్లాడుతూ.. ప్రతి దుకాణంలో ఒకే విధమైన ధరలు ఉండేలా చూసుకోవాలని, అదే సమయంలో అన్ని షాపుల వద్ద విధిగా ధరల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు.

లాక్‌డౌన్‌ను ఆసరాగా చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లాక్ డౌన్ సడలింపు సమయంలో ప్రకాశం బజార్, కూరగాయల మార్కెట్‌లలో కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని దీని కారణంగా కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నదన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాల్లో విశాలమైన ప్రదేశాలలో భౌతిక దూరం పాటించేలా కూరగాయల మార్కెట్లు ఏర్పాటులా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శుక్రవారం మళ్లీ తాను మార్కెట్ సందర్శిస్తానని అన్ని రకాల జాగ్రత్తలతో విక్రయాలు జరిగేలా చూడాలని డీఐజీ సూచించారు. అనంతరం ఆయన ప్రకాశం బజార్‌లోని సంఘమిత్ర బ్యాంకును సందర్శించి బ్యాంకు అధికారులు, సిబ్బందితో మాట్లాడారు.

ఉదయం 10 గంటల వరకే బ్యాంకు సేవలు

లాక్ డౌన్ నేపథ్యంలో బ్యాంకులు ఉదయం 10 గంటల వరకు ఖాతాదారులకు సేవలందించాలని 10 గంటల తర్వాత బ్యాంకులలో కేవలం అంతర్గత వ్యవహారాలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ బ్యాంకులలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట వన్ టౌన్ సీఐ నిగిడాల సురేష్, పోలీస్ సిబ్బంది, కూరగాయల మార్కెట్ వ్యాపారులున్నారు.

Advertisement

Next Story

Most Viewed