దేశంలో తగ్గిన చైనా పెట్టుబడులు!

by  |
దేశంలో తగ్గిన చైనా పెట్టుబడులు!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో చైనా నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐలు 28.48 శాతం క్షీణించి 163.77 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయని కేంద్రం వెలడించింది. భారత్‌లో చైనా కంపెనీల నుంచి వచ్చే నిధుల ప్రవాహం వార్షిక ప్రాతిపదికన 2017-18లో 350.22 మిలియన్ల నుంచి 2018-19లో 229 మిలియన్లకు తగ్గాయని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలిపారు. గత మూడేళ్లుగా చైనా నుంచి వచ్చే ఎఫ్‌డీఐలు తగ్గుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.

అలాగే, ప్రస్తుత ఏడాదిలో భారత్ నుంచి చైనాకు తరలిన పెట్టుబడులు 20.63 మిలియన్ డాలర్లని చెప్పారు. గతేడాది ఇదే సమయంలో చైనాకు 27.57 మిలియన్ డాలర్లు తరలి వెళ్లాయని వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కొవిడ్-19 వ్యాప్తి కారణంగా చైనా సంస్థలను భారత కంపెనీల్లో వాటాలను పొందకుండా పరిమితం చేసేందుకు ప్రభుత్వం తన ఎఫ్‌డీఐ విధానాన్ని కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. భారత్‌తో సరిహద్దులను పంచుకొనే దేశాలు, అక్కడి వ్యక్తులు, వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసింది.

Read Also…

తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం!

Next Story

Most Viewed