తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం!

by  |
తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం!
X

దిశ, వెబ్‌డెస్క్: వినియోగదారుల ధరల సూచీ రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) ఆగస్టులో 6.69 శాతంతో కొద్దిగా తగ్గింది. జులై రిటైల్ ద్రవ్యోల్బణం 6.73 శాతంగా నమోదైంది. అయితే, అంచనాలకు తగినట్టుగా ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మీడియం టర్మ్ పరిధి 4-6 శాతానికి మించి నమోదైంది. మాంసం, చేపలు ఆగష్టులో అత్యధిక ద్రవ్యోల్బణ రేటు 16.50 శాతంగా ఉన్నాయి. ‘కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపుతో అవసరమైన కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడంతో ధరల లభ్యత కూడా మెరుగుపడిందని’ జాతీయ గణాంకాల కార్యాలయం తెలిపింది.

కీలకమైన పాలసీ రేట్లను నిర్ణయించే సమయంలో ఆర్‌బీఐ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నిశితంగా పరిశీలిస్తుంది. ఆగష్టులో జరిగిన చివరి సమావేశంలో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా రెపో రేటును మార్చలేదు. రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ త్రైమాసికంలో అధిక స్థాయిలో ఉండే అవకాశముందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. కాగా, సోమవారం ఉదయం వెల్లడించిన హోల్‌సేల్ ధరల సూచిక టోకు ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) నాలుగు నెలల తర్వాత సానుకూలంగా 0.16 శాతానికి పెరిగిందని పరిశ్రమల విభాగం వెల్లడించింది. అలాగే, పారిశ్రామికోత్పత్తి సూచిక(ఐఐపీ) జులైలో 10.4 శాతం తగ్గిన సంగతి తెలిసిందే. ప్రధానంగా తయారీ, మైనింగ్, విద్యుత్‌ రంగాల ఉత్పత్తి క్షీణించడమే ఇందుకు కారణమని అధికారులు పేర్కొన్నారు.

Read Also…

అమ్మకాల్లో ఒత్తిడి… స్వల్ప నష్టాల్లో మార్కెట్లు!

Next Story