తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. అప్పటివరకు ఆగాల్సిందే!

by Shamantha N |
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. అప్పటివరకు ఆగాల్సిందే!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో వరుసగా ఇంధన చార్జీలు పెంపు సామాన్యుడి నెత్తిన పెనుభారాన్ని మోపాయి. లాక్‌డౌన్ పుణ్యమా అని ఇప్పుడిప్పుడే గాఢిన పడుతున్న ట్రాన్స్పోర్టు, ఇండస్ట్రీ, కంపెనీలకు కొత్త తలనొప్పిని తీసుకొచ్చాయి. పాండమిక్ సమయంలో ఆర్థికంగా నష్టపోయిన వారు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం అటు ఇంధన ధరలు, ఇటు వంట గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతోంది. దేశచరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా 16 రోజులు ఇంధన ధరలు పెరగగా, గ్యాస్ ధరలు గణనీయంగా రెండు సార్లు పెరిగాయి. దీంతో నిత్యవసరాల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఆదాయంలో ఎలాంటి పెరుగుదల లేకపోయినా ఖర్చులు విపరీతంగా పెరగడంతో మిడిల్ క్లాస్ బతుకులు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారయ్యాయి.

రోజువారీగా ఇంధన చార్జీల వరుసగా పెరుగుతుండటంపై ప్రతిపక్షాలతో పాటు ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ‘కొవిడ్ -19 సమయంలో వరల్డ్ వైడ్‌గా ఇంధనానికి డిమాండ్ గణనీయంగా తగ్గిపోయింది. దీంతో గతేడాది ఏప్రిల్‌లో చమురును ఉత్పత్తి చేసే దేశాలు ప్రొడక్షన్ తగ్గించాలని నిర్ణయించాయి. ఇంధన డిమాండ్ గణనీయంగా పెరిగినపుడు సప్లయ్ లేని కారణంగా ఎక్కువ లాభానికి అమ్ముకోవాలని ఈ దేశాలు ప్లాన్ చేశాయి. ప్రస్తుతం కూడా ఇంధన ఉత్పత్తి తక్కువగా అవుతుండగా, డిమాండ్ మాత్రం కొవిడ్ పూర్వ పరిస్థితులకు చేరుకుంది. దేశానికి ఆయిల్ సప్లయ్ నిలిచిపోవడం వల్లే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని కేంద్రమంత్రి వారణాసిలో జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

దేశీయంగా పెట్రోల్, డీజిల్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాల్లోని తమ సహచరులను చమురు ఉత్పత్తిని పెంచాలని కోరినట్లు, తద్వారా భారతీయ కస్టమర్లకు ఇంధన ధరలు పెరగడం నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. అతిపెద్ద చమురు కొనుగోలు దారుగా ఉన్న భారత్ ప్రధానంగా రష్యా, ఖతార్, కువైట్ వంటి దేశాలపై ఒత్తిడి సృష్టిస్తోందన్నారు. ఉత్పత్తి గణనీయంగా పెరిగినప్పుడు బ్యారెల్ కొనుగోలు ఖర్చు తగ్గుతుందని, తద్వారా రిటైల్ ఇంధన ధర కూడా తగ్గుతుందని తెలిపారు.

డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు ఎప్పుడు తగ్గుతాయని కేంద్రమంత్రిని అడిగినపుడు ‘మార్చి లేదా ఏప్రిల్’ నాటికి తగ్గుతాయని ఆయన జవాబిచ్చారు. అంతేకాకుండా, భవిష్యత్‌‌లో భారత్ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించి సీఎన్‌జీ, ఎలక్ర్టానిక్ వెహికిల్స్ పరిమితిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed