వారాంతం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
వారాంతం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించాయి. అంతకుముందు సెషన్‌లో భారీ లాభాలను చూసిన సూచీలు శుక్రవారం ట్రేడింగ్‌లోనూ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా ఉదయం కొద్దిసేపు బలహీనంగా ర్యాలీ చేసిన మార్కెట్లు ఆ తర్వాత నుంచి స్థిరమైన లాభాలతో రాణించాయి. ప్రధాన రంగాల్లో మదుపర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం, దేశీయ ఈక్విటీల్లోకి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించడం వంటి అంశాలు మెరుగైన లాభాలకు కారణమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 253.31 పాయింట్లు లాభపడి 73,917 వద్ద, నిఫ్టీ 62.25 పాయింట్ల లాభంతో 22,466 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, మెటల్, రియల్టీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రా సిమెంట్, కోటక్ బ్యాంక్, ఐటీసీ, మారుతీ సుజుకి, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, హిందూస్తాన్ యూనిలీవర్, నెస్లె ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, విప్రో స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.37 వద్ద ఉంది.



Next Story