జాయింట్ మ్యూచువల్‌ ఫండ్ ఖాతాలకు నామినీ తప్పనిసరి కాదు

by S Gopi |
జాయింట్ మ్యూచువల్‌ ఫండ్ ఖాతాలకు నామినీ తప్పనిసరి కాదు
X

దిశ, బిజినెస్ బ్యూరో: మ్యూచువల్ ఫండ్ జాయింట్ ఖాతాలకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ ఖాతాలకు నామినీ ఎంచుకునే ప్రక్రియను ఆప్షనల్‌గా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెబీ తెలిపింది. ఇదే సమయంలో కమొడిటీ, విదేశీ ఇన్వెస్టర్ల పర్యవేక్షణ కోసం ఒకే ఫండ్ మేనేజర్ ఉండేందుకు ఫండ్ హౌస్‌లకు అనుమతించింది. దీనివల్ల ఫండ్ నిర్వహణ ఖర్చును తగ్గిస్తుంది. సెబీ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ మ్యూచువల్ ఫండ్ నిబంధలను సమీక్షించి, వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు చేసిన సిఫార్సుల ఆధారంగా సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. జాయింట్ మ్యూచువల్ ఫండ్ ఖాతాలు కలిగిన ఇన్వెస్టర్లకు సెబీ తాజా నిర్ణయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జాయింట్ ఖాతా ఉన్నవారిలో ఒకరికి అనుకోకుండా ఏదైనా జరిగితే నిధుల బదిలీ, ఇతర ప్రక్రియలను సులభంగా పూర్తవుతుందని తెలిపారు. కాగా, మ్యూచువల్ ఫండ్ ఖాతాలు ఉన్న వ్యక్తులు నామినీని ఎంపిక చేయడం లేదా వద్దని తెలియజేయడాన్ని సెబీ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీనికి ఈ ఏడాది జూన్ 30 వరకు గడువు ఇచ్చింది. ఆలోపు ఏ నిర్ణయం చెప్పకపోతే గడువు అనంతరం నిధులు విత్‌డ్రా చేసేందుకు వీలవదు.



Next Story