‘నాగులు బలిదానం… అందరినీ కలచివేసింది’

by  |
‘నాగులు బలిదానం… అందరినీ కలచివేసింది’
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: తెలంగాణ ఉద్యమకారులందరిదీ, ఇటీవల ఆత్మబలిదానం చేసుకున్న నాగులు పరిస్థితిలాగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. న్యాయం కోరుతూ ఇటీవల రవీంద్రభారతి ఎదుట ఆత్మహత్యకు యత్నించి.. చికిత్స పొందుతూ మరణించిన నాగులు కుటుంబాన్ని ఆదివారం భట్టి విక్రమార్క పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడుతాయని ఆశించామన్నారు.

అందరికీ ఉద్యోగాలు వచ్చి, ఆత్మగౌరవంతో బతకొచ్చని ఆశించామని, కానీ నేడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని వాపోయారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నేటికీ ఎటువంటి మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగులు పెట్రోల్ పోసుకుని తనకు తాను నిప్పు పెట్టుకుని సజీవ దహనం అవుతూ మాట్లాడిన మాటలు.. పచ్చి నిజం అన్నారు. నాగులు ఆత్మబలిదానం యావత్ రాష్ట్ర ప్రజలందరినీ కలిచి వేసిందని తెలిపారు. ఆత్మ బలిదాన సమయంలో నాగులు చెప్పిన మాటలనే కాంగ్రెస్ పార్టీ కొన్నేళ్లుగా చెబుతోందని వెల్లడించారు.

తెలంగాణ ఫలాలు.. కేసీఆర్ కుటుంబం మాత్రమే అనుభవిస్తోందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిజం అయ్యాయని అన్నారు. నాగులు బలిదాన ఘటన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వాదులను అత్యంత తీవ్రంగా కలిచి వేస్తోందన్నారు. తెలంగాణ లక్ష్యాన్ని సాధించడం కోసం మేధావులు, ప్రజలు కదలాల్సిన అవసరం ఉందని భట్టి పిలుపునిచ్చారు. నాగులు కుటుంబానికి న్యాయం జరగాలని డిమండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, ఇతర సీనియర్ నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed