చెవిరెడ్డి!మీ చెంచాలను అదుపులో పెట్టుకో: అచ్చెన్నాయుడు మాస్ వార్నింగ్

by Seetharam |
achem
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల ఆగడాలకు అంతేలేకుండా పోయిందని మండిపడ్డారు. చంద్రగిరి మండలం భీమవరం గ్రామ టీడీపీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడుపై వైసీపీ నేతల దాడిని అచ్చెన్నాయుడు ఖండించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. చెవిరెడ్డీ మీ గూండాలను అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మద్యం, గంజాయి మత్తులో చెవిరెడ్డి అనుచరులు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, నవీన్ రెడ్డి తన అనుచరులతో ఇష్టానుసారంగా దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తనయుడు మోహిత్ రెడ్డి తన చెంచాలను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఓటమి అంచున వైసీపీ వేలాడుతున్నందునే దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి గాల్లో తిరుగుతూ...శాంతిభద్రతలు గాలికొదిలేశారని, ఎన్ని దాడులు, బెదిరింపులకు దిగినా టీడీపీ వెనకడుగు వేయదన్న విషయాన్ని వైసీపీ గూండాలు గుర్తుంచుకోవాలన్నారు. పవిత్రమైన తిరుపతి పరిసర ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తున్నారని, మునిరత్నం నాయుడుపై దాడి చేసి నగదు, బంగారం కూడా లాక్కెళ్లి బందిపోటు ముఠాను తలపించారని దుయ్యబట్టారు. దాడి చేసిన వైసీపీ నేతలపై ఎస్పీ పరమేశ్వరరెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ దాడిలో మునిరత్నం తీవ్రంగా గాయపడ్డారని, మునిరత్నం కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed