Mohammad Yunus: పొరుగు దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం.. మహమ్మద్ యూనస్
భారత్తో పాటు పొరుగు దేశాలతో బంగ్లాదేశ్ సత్సంబంధాలను కోరుకుంటోందని తాత్కాలిక సలహాదారు డాక్టర్ మహమ్మద్ యూనస్ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: భారత్తో పాటు ఇతర పొరుగు దేశాలతో బంగ్లాదేశ్ సత్సంబంధాలను కోరుకుంటోందని, కానీ అవి న్యాయం, సమానత్వం ఆధారంగా ఉండాలని బంగ్లాదేశ్ తాత్కాలిక సలహాదారు డాక్టర్ మహమ్మద్ యూనస్ అన్నారు. బుధవారం ఆయన టెలివిజన్ ప్రసంగంలో మాట్లాడారు. వరదలను ఎదుర్కొనేందుకు ఇప్పటికే భారత్తో ద్వైపాక్షిక సహకార చర్చలను ప్రారంభించామని చెప్పారు. దక్షిణాసియాలో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడంలో సార్క్ను పునరుద్ధరించడానికి కూడా తాను చొరవ తీసుకున్నట్టు వెల్లడించారు. బంగ్లాదేశ్ను గౌరవప్రదమైన ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచం గుర్తించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. దేశాన్ని సంస్కరించే ప్రయత్నంలో భాగంగా ఎన్నికల వ్యవస్థతో సహా ఆరు కీలక రంగాలలో కమిషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఈ కమిషన్లు అక్టోబర్ 1 నుంచి తమ విధులను ప్రారంభిస్తాయని, రాబోయే మూడు నెలల్లో నివేదిక అందజేస్తాయని తెలిపారు. అందరికీ సమాన హక్కులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని నొక్కి చెప్పారు.