‘అమూల్ బటర్ మిల్క్’ చెద పురుగులు.. క్షమాపణలు చెప్పిన సంస్థ

ఆన్‌లైన్ వస్తువులు కొనాలంటేనే కస్టమర్లు భయపడుతున్నారు. ఒక వస్తువు ఆర్డర్ పెడితే.. ఇంకో వస్తువు పంపించడం వంటివి నెట్టింట చూస్తూనే ఉన్నాం.

Update: 2024-07-18 08:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆన్‌లైన్‌ ద్వారా ఏదైనా కొనాలంటేనే కస్టమర్లు భయపడుతున్నారు. ఒక వస్తువు ఆర్డర్ పెడితే.. ఇంకో వస్తువు పంపించడం వంటివి అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఫుడ్ విషయంలో కూడా నాణ్యత లేని ప్రొడక్ట్స్ పంపుతారేమోనని కస్టమర్లు జంకుతున్నారు. ఫుడ్ విషయంలో ఆన్‌లైన్ ఆర్డర్ బెటరా? లేదా ఆఫ్‌లైన్‌ వెళ్లి తెచ్చుకోవాలా? అనే చర్చ ప్రస్తుతం నెట్టింట జరుగుతోంది. ఎందుకంటే.. తాజాగా అమూల్ బటర్ మిల్క్ పార్సిల్ ఓపెన్ చేయగానే తెల్లని చెద పురుగులు ఓ నెటిజన్‌కు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

గజేందర్ యాదవ్ అనే నెటిజన్ ఇటీవల అమూల్ కూప్ వెబ్ సైట్ నుంచి అమూల్ బటర్ మిల్క్ ఆర్డర్ పెట్టాడు. పార్సిల్ వచ్చిన తర్వాత తెరిచి చూస్తే.. తెల్లని చెద పురుగులు చూసి షాక్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పోస్ట్ చేశాడు. ‘అమూల్ కూప్ వెబ్‌సైట్ నుంచి ఉత్పత్తులను కొనడం ఆపివేయండి, హే అమూల్ మీరు మజ్జిగతో పాటు మాకు పురుగులను కూడా పంపారు. నాణ్యత ఉండటం వల్ల నేను ఎల్లప్పుడూ అమూల్‌ని విశ్వసిస్తున్నాను, అందుకే ఈ సంఘటన చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్యాకెట్ లోపల బటర్ మిల్క్ కూడా అప్పటికే పాడైపోయింది. మజ్జిగ నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది’ అని ట్వీట్ చేశాడు. మరోవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులకు, కంపెనీకి ట్యాగ్ చేశాడు.

ఈ ట్వీట్ వైరల్ కావడంతో గుజరాత్‌లోని అమూల్ హెడ్ ఆఫీస్ స్పందించి.. తనకు కాల్ చేసినట్లు నెటిజన్ తెలిపాడు. ఆన్‌లైన్ ఆర్డర్ తర్వాత పార్సిల్ ఆలస్యం కారణంగా ఇది జరిగిందని వారు చెప్పారని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే తనకు క్షమాపణలు చెప్పారని వివరించారు. ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని హామీ ఇచ్చినట్లు వెల్లడంచాడు. అయితే, పాల ఉత్పత్తులను 3 రోజుల్లో డెలివరీ చేయాలని నెటిజన్ సంస్థకు సలహా ఇచ్చినట్లు తెలిపాడు.

Tags:    

Similar News