‘దమ్ముంటే సిరిసిల్లలో చర్చకు సిద్ధమా..?’.. కేటీఆర్‌కు MLA ఆది శ్రీనివాస్ ఛాలెంజ్

‘వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం మీరు కాదా’ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్‌ను ప్రశ్నించారు. ఇప్పుడు మొసలి కన్నీళ్లు పెట్టి

Update: 2024-07-09 15:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం మీరు కాదా’ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్‌ను ప్రశ్నించారు. ఇప్పుడు మొసలి కన్నీళ్లు పెట్టి చేనేత కార్మికులను మోసం చేసేందుకు రెడీ అవుతున్నారని ఆయన మంగళవారం ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఫైర్ అయ్యారు. ఉపాధి కల్పించామని చెప్పి వస్త్ర పరిశ్రమను రోడ్డున పడేశారన్నారు. దమ్ముంటే సిరిసిల్ల పట్టణంలో కార్మికులు, ఆసాములతో చర్చకు సిద్ధమా..? అని ప్రశ్నించారు. ఇకనైనా నేతన్నలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో రూ.247 కోట్లు బకాయిలు పడ్డాయని వెల్లడించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు సార్లు కలిపి దాదాపు రూ. 155 కోట్లు చెల్లించామన్నారు.

రేవంత్ రెడ్డి సర్కార్ నేతన్నల సమస్యలకు పరిష్కారం చూపుతూ, ఉపాధి కల్పించే అంశంపై సానుకూలంగా ఉన్నదన్నారు. సిరిసిల్లలో సాఫీగా సాగుతున్న వస్త్ర పరిశ్రమలో బతుకమ్మ చీరల పేరిట స్కీం ఏర్పాటు చేసి 2014 వరకు మార్కెట్‌తో అనుసంధానమైన వస్త్ర పరిశ్రమను 2017లో బతుకమ్మ చీరల పేరిట పథకం పేరిట అమలు చేశారని గుర్తు చేశారు. దీని వలన కేవలం మూడు నుంచి నాలుగు నెలల పాటు ఉపాధి మాత్రమే కల్పించారన్నారు. మిగతా కాలమంతా చేనేత కార్మికులు ఉపాధికి గండి పడిందని పేర్కొన్నారు.


Similar News