పల్లెల్లో గుప్పుమంటున్న గుడుంబా..దసరా పండుగతో బెల్లం వ్యాపారుల జోరు

పచ్చని పల్లెలను మద్యం మంటలు దహించివేస్తోంది.

Update: 2024-10-12 07:43 GMT

దిశ,డోర్నకల్: పచ్చని పల్లెలను మద్యం మంటలు దహించివేస్తోంది.నాటు సారా మహమ్మారికి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.కష్టాల కల్లోలంలోకి నెట్టేస్తున్నాయి.గ్రామంలో మంచినీళ్లు దొరకని చోట కూడా సారా ఏరులై పారుతుంది.. బడుగు జీవుల ప్రాణాలను నిత్యం వేటాడుతుంది.పల్లెలు పచ్చగా ఉంటే అందం.అక్కడ స్వచ్ఛమైన జలాలు పారితే.. ప్రకృతి పులకరిస్తుంది. పుష్కలంగా పంట సిరులు కురుస్తాయి.మరి అదే పల్లెల్లో గుడుంబా బట్టీలు వెలిస్తే.. ఆ ఊర్లన్నీ జీవచ్చవాలతో నిండిపోయి స్మశాన నిశబ్దాలకు నెలవవుతాయి.బతుకులు చితికిపోయి.. పచ్చని కాపురాలు పాడెక్కుతున్నాయి.

దుబ్బ తండ,మోదుగడ్డ తండా, ఆందనాలపాడు,చిలుకోయలపాడు,జోగ్యతండా, బొడ్రాయి తండా,పెరుమాండ్ల సంకీస తో సహా చాలా గ్రామాల్లో గుడుంబా కోరలు చాస్తూనే ఉంది. నిండా 30 ఏండ్లు కూడా నిండని యువకులు, వృద్ధులు సారాయికి బానిసై తనవులు చాలిస్తున్నారు.గుడుంబా ధాటికి గూడు చెదిరి చల్లా చెదురవుతున్నాయి.అమ్ముకునేటోడు లాభం చూసుకుంటున్నడు.మరి తాగేటోల్లు పానం కోసం ఎందుకు ఆలోచించరు అన్న ఆ బాధిత కుటుంబీకుల ప్రశ్నకు బదులు చెప్పేదెవరు.? ఆ సోయిలేకనే ఇప్పటికీ ఎన్నో ప్రాణాలు గుండiబా రక్కసి కోరల్లో చిక్కి గోడమీద ఫోటోలోకెక్కుతున్నారు.మద్యం ఊబిలో చిక్కి తాము మునిగి చస్తూ కుటుంబాలను కూడా నడిరోడ్డున పడేస్తున్నారు.

చిన్న వయసులో వైధవ్యం పోయి కొందరు,చదువుకోవాల్సిన వయస్సులో కుటుంబ భారం మీద పడి మరికొందరు. మహిళలు బతుకుతో,సమాజంతో ఒంటరి పోరాటం చేస్తున్నారు.తాగుడుకు బానిసైన తమ భర్తలు, తండ్రులు,అన్నదమ్ములను మార్చుకోలేక పోయిన మహిళలు గుడుంబా కాసే వారిని కలిసి తమ వాళ్లకు గుడుంబా విక్రయించ వద్దని కాళ్లా వేళ్లా పడ్డ వాళ్ళు కనికరించడం లేదు.మా వ్యాపారం మాదేనంటున్నారు.దీంతో కళ్లముందే ఇంట్లో వారు తాగుడుకు తగలబడిపోతుంటే ఏం చేయలేక మహిళలు కన్నీరు మున్నీరవడం తప్ప ఏమీ చేయలేక పోతున్నారు.

బెల్లం,గుడుంబా పల్లెల్లో పారదోలాలి..

పచ్చని పల్లెలను పిచాచిల పట్టిపీడిస్తున్న సారాయి, పటిక,బెల్లం రవాణాను పూర్తిగా అరికట్టాలని బాధిత కుటుంబాలు బోరు మంటున్నాయి.పల్లెల్లో ప్రాణాలు కోల్పోకుండా బెల్లం అక్రమార్కుల పై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికార యంత్రాంగాన్ని కోరుతున్నారు.అక్రమ బెల్లం రవాణా జోరుకు అడ్డుకట్ట పడేదేన్నడో అని పౌరులు చర్చించుకుంటున్నారు.

ముడి సరుకు చీకటి రవాణా..

మండలంలో బెల్లం,పటిక అక్రమ రవాణా ఆగడం లేదు.అక్రమ సంపాదన కు అలవాటు పడిన వ్యాపారులు అడ్డదారుల్లో బెల్లం సరఫరా చేస్తున్నారు.సిండికేట్ గా ఏర్పడి ఏజెంట్ల ద్వారా గ్రామాలు,తండా లకు సరఫరా చేస్తున్నారు. తిరుమలాయపాలెం మీదుగా డోర్నకల్ ప్రాంతానికి సరఫరా చేస్తున్నారు.ఈ వ్యాపారమంతా మండల శివారులో జరుగుతుంది.దసరా,దీపావళి పండుగల వేళ బెల్లం వ్యాపారుల జోరు మూడు దారులు..ఆరు లోడులుగా సాగుతుంది.

పోలీసులు,ఎక్సైజ్ అధికారుల కళ్ళు కప్పి..

మండల శివారు ప్రాంతానికి టన్నుల కొద్ది నల్ల బెల్లం,పటిక వస్తుందని సమాచారం. దసరా,దీపావళి పండుగల వేళ అక్రమ వ్యాపారులు అధికారుల కళ్ళు కప్పి తెల్లవారుజామున రవాణా సాగిస్తున్నారు.ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బెల్లం లోడును శివారు ప్రాంతాల్లో నిలిపి ఆటోలు,ద్విచక్ర వాహనాల ద్వారా పల్లెలకు సరఫరా చేస్తున్నారు.నిమిషాల వ్యవధిలో దిగుమతి చేస్తున్నారు.ఇటు పోలీసులు,అటు ,ఎక్సైజ్ అధికారులు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించిన వారి కంట పడకుండా అత్యంత రహస్యంగా లోడుకు ముందు వెనక ఎస్ కార్డు లా ఏజెంట్లే ద్విచక్ర వాహనాలతో వెళ్తూ బెల్లాన్ని గమ్యస్థానానికి చేరుస్తున్నారు.ఏటి పరివాహక ప్రాంతం,గుట్టలు,చెట్ల పొదల్లో డంపు చేస్తూ తమ అడ్డాగా మార్చుకుంటున్నారు.


Similar News