Viral Video : గూడు చెదిరిన కడదామనే ఆశ! కూలిన ఇళ్ల వద్ద చిన్నారులు.. వీడియో వైరల్

మూసీ సుందరీకరణ లో భాగంగా రివర్ బెడ్ ప్రాంతాల్లో నిర్మించిన కట్టడాల కూల్చివేతలను మంగళవారం ప్రభుత్వం ప్రారంభించింది.

Update: 2024-10-01 11:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ సుందరీకరణ లో భాగంగా రివర్ బెడ్ ప్రాంతాల్లో నిర్మించిన కట్టడాల కూల్చివేతలను మంగళవారం ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే నది పరీవాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలకు నోటీసులు ఇచ్చిన అధికారులు.. ఆయా నివాసాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించి చంచల్‌గూడలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు తరలించారు. ముందుగా మలక్‌పేట నియోజకవర్గంలోని శంకర్‌నగర్ బస్తీ, చాదర్‌ఘట్ ప్రాంతాల్లో కూల్చివేత్తలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే శంకర్ నగర్‌లో కూలిపోయిన ఇళ్ళ దగ్గర ఇద్దరు చిన్నారుల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కూలిన ఇళ్ళ శిధిలాలతోనే చిన్నారులు మళ్లీ ఇల్లు కట్టుకుంటున్నారని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గూడు చెదిరినా కడదామనే ఆశ చిన్నారుల్లో ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే ఈ వీడియోను కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘ముఖ్యమంత్రి, వారి గూడుని కూల్చేశారు! వారి కలలను చిదిమేశారు! ఆ కూలిన ఇంటి శిథిలాల్లో వారి జీవితాలను వెత్తుకుంటున్నారు! మీ మంత్రులను వచ్చి చెప్పమనండి.. వీళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారని! మీరొచ్చి ఆ చిట్టి తల్లులకు చెప్పండి.. మీ ఇళ్ళు కూల్చి, మాల్స్ కడుతున్నాము.. మీ బ్రతుకులు బాగుపడతాయని, రాహుల్ గాంధీ ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన’ అంటూ ట్వీట్ చేశారు. అదేవిధంగా వీడియో పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ.. వాళ్ళు ఇప్పుడు ఇళ్ళు కోల్పోవడమే మంచిదని, మళ్ళీ వరదల్లో కొట్టుకొని పోయేకంటే కనీసం ఇప్పుడు ప్రాణాలతో అయినా బతికుంటారని కూల్చివేతలకు సపోర్టుగా కామెంట్స్ పెడుతున్నారు.


Similar News