KTR: వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు నష్ట పరిహారం ప్రకటించాలి: కేటీఆర్

రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ. 5 లక్షలు నష్టపరిహారం ప్రకటించటం అన్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Update: 2024-09-02 09:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ. 5 లక్షలు నష్టపరిహారం ప్రకటించటం అన్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాగా మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు నష్ట పరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారే వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు.. మీరిచ్చిన మాటను నిలబెట్టుకొని రూ. 25 లక్షలు పరిహారం ప్రకటించండంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరముందని అన్నారు.

వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే అంతకన్నా మోసం మరొకటి ఉండదు సీఎంపై విరుచుకుపడ్డారు. అదే విధంగా వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన, డ్యామేజ్ అయిన వారికి రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు సాయం చేస్తామన్నారని, ఆ హామీని కూడా నేరవేర్చండని కేటీఆర్ అడిగారు. ప్రభుత్వ అసమర్థత, చేతగానితనం, ముందస్తు ప్రణాళిక లేకపోవటం కారణంగానే ప్రాణనష్టం జరిగిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజల ప్రాణాలు రక్షించేందుకు చర్యలు చేపట్టి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పించండంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. 


Similar News