'పోడు పట్టాల పంపిణీ ఎలా?'.. స్పష్టత ఇవ్వాలని గిరిజన సంక్షేమ కార్యదర్శికి వినతి

రాష్ట్రంలో లక్షలాదిమంది గిరిజనులు ఆతృతతో ఎదురు చూస్తున్న పోడు భూముల హాక్కు పత్రాలను ఎలా పంపిణీ చేస్తున్నారో స్పష్టత ఇవ్వాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి.

Update: 2023-06-20 16:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో లక్షలాదిమంది గిరిజనులు ఆతృతతో ఎదురు చూస్తున్న పోడు భూముల హాక్కు పత్రాలను ఎలా పంపిణీ చేస్తున్నారో స్పష్టత ఇవ్వాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరామ నాయక్ లు సంయుక్తంగా మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి క్రిష్టియాన జడ్ చోంగ్తూ‌ని కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం జూన్ 24 నుంచి 30 వరకు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు జిల్లా స్థాయిలో ఎక్కడ? ఎవరి ద్వారా ఇస్తారు? లబ్ధిదారుల లిస్తులు గోప్యంగా ఉంచడం వలన ఆందోళన నెలకొన్నది తెలిపారు.

సీఎం అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 11.50 లక్షల ఎకరాల పై హక్కులు కల్పించే విధంగా నోడల్ అధికారిగా ప్రభుత్వం పై ఒత్తిడి చేయాలని కోరారు. గత రెండు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ట్రైకార్ రుణాలను తక్షణం విడుదల చేయాలని, మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ట్రైకార్ యాక్షన్ ప్లాన్ ను ప్రకటించాలని విజ్ఞప్తిచేశారు.

విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో గురుకులాలు, కాలేజీ హాస్టల్స్ లో దరఖాస్తు చేసుకున్న గిరిజన విద్యార్థులందరికీ సీట్లు ఇవ్వాలన్నారు. గురుకులాలు, హాస్టల్స్ విద్యార్థులకు సరిపడా లేనందున నూతన భవనాలను నిర్మించాలని కోరారు. గిరిజన బెస్ట్ అవైలబుల్ పథకంలో ప్రతి ఏడాదికి 15 వేలకు పైగా దరఖాస్తులు వస్తున్నాయని కానీ అందులో కేవలం 7 వందల సీట్ల వరకే భర్తీకి అవకాశం ఉన్న నేపథ్యంలో మరో 2 వేల సీట్లను తక్షణం పెంచాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని జిల్లాల్లో అవినీతి అక్రమార్కులకు పాల్పడుతున్న డీటీడీఓ లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మానాయక్, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Similar News