గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తెలంగాణ.. టోక్యోలో ఆ కంపెనీ సందర్శించిన భట్టి

దేశానికి గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తెలంగాణ మారనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు.

Update: 2024-10-01 13:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశానికి గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తెలంగాణ మారనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీని స్థాపించడానికి జపాన్‌కు చెందిన యమనాషి కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సహకార ప్రయత్నంతో తెలంగాణ హరిత భవిష్యత్తు వైపు అడుగులు వేస్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం జపాన్ రాజధాని టోక్యో నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న యమనాషి గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని తాజాగా సందర్శించారు. అక్కడి అత్యాధునిక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రక్రియలు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌లు, ఇతర పునరుత్పాదక ఇంధన సాంకేతికతలపై చర్చిస్తూ కేంద్రంలోని శాస్త్రవేత్తలు, అధికారులతో డిప్యూటీ సీఎం నిమగ్నమయ్యారు. ఆయన వెంట ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌, సింగరేణి సీఎండీ ఎన్‌.బలరామ్ ఉన్నారు.

భారత్ థర్మల్ పవర్‌కు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక ఇంధనం వైపు వెళుతున్నందున, ఈ పరివర్తనలో తెలంగాణ ముందంజలో ఉందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సోలార్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. తెలంగాణాలోనూ ఇలాంటి గ్రీన్ హైడ్రోజ‌న్ ప్లాంట్‌ల‌ను నెల‌కొల్పేందుకు త‌క్షణం స‌న్నాహాలు చేయాల‌ని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని పుష్కలమైన నీటి వనరులు, సోలార్ ప్లాంట్‌లకు అనువైన ప్రదేశాలున్నాయని చెప్పారు. దేశంలో గ్రీన్ హైడ్రోజన్‌కు తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.ఈ మేరకు ప్రతిపాదనలను వెంటనే రూపొందించాలని తన బృందానికి సూచించారు.

అదేవిధంగా యమనాషి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ అభివృద్ధి చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్‌ఎస్) యూనిట్‌ను కూడా డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఈ సాంకేతికతను సింగరేణి సోలార్ ప్లాంట్‌లకు, అలాగే అదనంగా 1,000 మెగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని విస్తరించేందుకు ప్రణాళికాబద్ధంగా ఉపయోగపడుతుందని భట్టి పేర్కొన్నారు. యమనాషి అధికారులతో చర్చల సందర్భంగా తెలంగాణలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు, బీఈఎస్‌ఎస్ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు జాయింట్ వెంచర్‌ను ఆయన ప్రతిపాదించారు. దీనిపై యమనాశి అధికారులు సానుకూలంగా స్పందించి తదుపరి చర్యలు చేపట్టారని ప్రకటించారు.


Similar News