Chicken: ప్రకాష్ నగర్లో 700 కేజీల కుళ్లిన చికెన్ సీజ్.. చట్నీస్, అల్పాహార్ టిఫిన్స్ లోనూ నాసిరకాలే

ప్రకాశ్ నగర్లో నిర్వహించిన తనిఖీల్లో 700 కిలోల చికెన్ ను సీజ్ చేశారు అధికారులు. చట్నీస్, అల్పాహార్ టిఫిన్స్ లో చేసిన తనిఖీల్లో నాసిరకం ఆహార పదార్థాలు లభ్యమయ్యాయి.

Update: 2024-10-18 08:53 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఆహారభద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు బేగంపేట ప్రకాశ్ నగర్లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్న చికెన్ షాపుల్లో కుళ్లిన స్థితిలో ఉన్న 700 కేజీల చికెన్ ను గుర్తించారు. దానిని స్వాధీనం చేసుకుని, యజమానులకు నోటీసులిచ్చారు. ఈ చికెన్ ను మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. చికెన్ ను అమిత ఇష్టంగా తినేవారు ఇకనైనా కాస్త జాగ్రత్తగా చూసి కొనుగోలు చేయడం మంచిది. బయట హోటళ్లలో దొరికే చికెన్ ను వీలైనంత వరకూ తినకపోవడమే మేలు.

చట్నీస్ లో నాణ్యత నిల్

మరోవైపు నిన్న కొండాపూర్ లోని శరత్ సిటీ మాల్ లో ఆహారభద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మాల్ లో ఉన్న చట్నీస్ లో తనిఖీలు చేయగా.. FSSAI లైసెన్స్ ను అందరికీ కనిపించేలా పెట్టలేదని గుర్తించారు. ఆహార తయారీకి వాడే పదార్థాలను బొద్దింకలు తిరిగే ప్లేస్ లో ఉంచారని, గోధుమపిండి, రవ్వ వంటి పదార్థాల్లో బ్లాక్ ఫంగస్ వచ్చిందని గుర్తించినట్లు ఎక్స్ వేదికగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం వెల్లడించింది. అలాగే ఉల్లిపాయలు, క్యాబేజీలు కూడా మనుషులు తినేలా లేవని పేర్కొంది. పాత్రలను శుభ్రం చేసే ప్రదేశం చెడువాసనతో ఉందని తెలిపింది. కూరగాయలను కట్ చేయడానికి ఐరన్ చాకుల్ని వాడుతున్నారని, వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను షేర్ చేసింది.

అదే మాల్ లో ఉన్న అల్పాహార్ టిఫిన్స్ లోనూ తనిఖీలు చేసిన అధికారులు.. అక్కడ కూడా ఐరన్ చాకులు వాడుతున్నట్లు గుర్తించారు. డస్ట్ బిన్స్ ను ఓపెన్ గానే వదిలేశారని, తయారు చేసిన ఆహారాన్ని మూతలతో కవర్ చేసి ఉంచడం లేదని అధికారులు తెలిపారు. ఫ్రిడ్జ్ లో ఉంచిన సెమీ ప్రిపేర్డ్ ఫుడ్ కూడా మూతలతో కప్పి లేదన్నారు. ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్లకు సరైన ట్రైనింగ్ ఇవ్వలేదన్నారు. 


Similar News