జీవో 317 అమలులో ప్రతిష్టంభన.. సీఎం చేతికి కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు

గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 అమలులో నెలకొన్న ప్రతిష్టంభన, ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించేందుకు మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ఏర్పడిన కేబినెట్ సబ్ కమిటీ తన తుది నివేదికను సీల్డ్ కవర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆదివారం సమర్పించింది.

Update: 2024-10-21 04:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 అమలులో నెలకొన్న ప్రతిష్టంభన, ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించేందుకు మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ఏర్పడిన కేబినెట్ సబ్ కమిటీ తన తుది నివేదికను సీల్డ్ కవర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆదివారం సమర్పించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ జీవో అభ్యంతరాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఫిబ్రవరి చివరి వారంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది.

తగిన సిఫారసులతో కూడిన నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగ సంఘాల నేతలతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించింది. ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారి నుంచి ఫిజికల్‌గా, ఆన్‌లైన్ ద్వారా గ్రీవెన్స్ అప్లికేషన్లను స్వీకరించింది. వివిధ శాఖల అధికారులతో, మేధావులతోనూ ప్రత్యేక సమావేశాలను నిర్వహించి ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదిలీ సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. గత ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో బదిలీలు చేసేందుకు వీలుగా ఈ జీవోను తీసుకొచ్చింది.

కేవలం బదిలీలకు మాత్రమే కాక కొత్త రిక్రూట్‌మెంట్లకు సైతం జోనల్ స్థానికత, స్పౌజ్ గ్రౌండ్ (భార్యాభర్తల ఉద్యోగాలు) తదితరాలను కూడా పరిగణనలోకి తీసుకుని కేడర్ అలాట్‌మెంట్ చేసేలా ఈ జీవో ద్వారా ఉన్నతాధికారులకు బాధ్యతలను అప్పజెప్పింది. జిల్లా స్థాయిలో జిల్లాల కలెక్టర్లు, జోనల్‌తో పాటు మల్టీ జోనల్ స్థాయిలో ఆయా శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలను బాధ్యులుగా నియమించింది అప్పటి ప్రభుత్వం.

కానీ బదిలీలతో పాటు పదోన్నతుల్లో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా ఈ జీవో అమల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. దీన్ని తొలగించడానికి మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. పలు దఫాలుగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రభుత్వానికి సిఫారసులతో పాటు నివేదికను మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రికి అందజేశారు.


Similar News