SSC Exams: కాసేపట్లో పది పరీక్షలు ప్రారంభం.. పరీక్ష రాయనున్న 5 లక్షల మంది విద్యార్థులు
పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి పరీక్షలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఎగ్జామ్స్కు సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 5,09,403 మంది విద్యార్ఢులు హజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పర్యవేక్షణ కోసం 2650 డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు, 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు ఉంటుందని అధికారులు తెలిపారు. హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పించినట్లు సూచించారు. స్టూడెంట్స్ అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
5 నిమిషాల గ్రేస్ పీరియడ్
ఈ సారి పరీక్ష రాసే విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ను ప్రకటించారు. పరీక్ష టైం కంటే ఐదు నిమిషాలు ఆలస్యంగా వెళ్లినా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. కానీ ముందు జాగ్రత్తగా కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఆలస్యంగా వెళ్లి టెన్షన్ తో పరీక్ష రాసే కన్నా ముందే చేరుకొని ప్రశాంతంగా పరీక్ష రాయాలని పేర్కొంటున్నారు.