అడవులను వదిలి జనారణ్యంలోకి వన్యప్రాణులు

అడవులు విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతుండటంతో జంతువులకు ఆహారం దొరక్క జనావాసాల్లోకి వస్తున్నాయి. అవి వీధి కుక్క, పెంపుడు జంతువులే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి.

Update: 2025-03-16 02:46 GMT

దిశ, తాండూరు రూరల్: అడవులు విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతుండటంతో జంతువులకు ఆహారం దొరక్క జనావాసాల్లోకి వస్తున్నాయి. అవి వీధి కుక్క, పెంపుడు జంతువులే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. వన్యప్రాణులు జనావాసాలలోకి రావడంతో తాండూరు మండల ప్రజలు వణికిపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు.

వరుసగా జంతువుల రాక..

ఈనెల 1వ తేదీన తాండూరు మండలం కోటబాష్పల్లి గ్రామ సమీపంలో గాయాలపాలై ఉన్న చిరుతపులి పిల్లను స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీ శాఖ అధికారుల బృందం దాన్ని కార్యాలయానికి తీసుకెళ్లి చికిత్స అందించారు. తీసుకుపోయిన కొద్దిసేపటికే చిరుత పులి పిల్ల మృతి చెందింది. జిన్‌గుర్తి, అడిగాచర్ల, తట్టేపల్లి సరిహద్దు కర్ణాటక రాష్ర్ట అటవీలోంచి పక్షులు చిరుతపులి పిల్లను ఎత్తుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. 48, 50 గంటల క్రితం ఇది జన్మించి ఉండంతో ఎండలో డీహైడ్రేషన్ కు గురై మృతి చెందినట్లు పశువైద్యాధికారిణి తెలిపారు. అదే మండలంలోని బేల్కటూరు గ్రామంలో ఈ నెల 14న ఎలుగుబంట్లు, హైనాలు సంచారం కలకలం రేపింది.

ఎలుగుబంటి పిల్లలతో సంచరిస్తుండగా గమనించిన వీధి కుక్కలు మొరుగుతూ ఎగబడటంతో ఎలుగుబంటి కుక్క పై దాడి చేసింది. దీంతో కుక్క నోటీ భాగంపై తీవ్రంగా గాయమైంది. కుక్కల అరుపులకు పాలిషింగ్ యూనిట్లో పని చేసే కార్మికులు బయటికి వచ్చారు. దీంతో ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోయింది. సమాచారం తెలుసుకున్న కరణ్ కోట్ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు పరిశీలించారు. ఎలుగుబంట్లు, హైనానా అని జంతువు మలవిసర్జన ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు.

తలదాచుకునే మార్గం లేక..

జిన్గుర్తి, తట్టేపల్లి, అడ్డిగాచర్ల, అంతారం ప్రాంతాల్లో అడవులు అంతరించిపోతున్నాయి. చిన్న చిన్న పొదలన్ని నేలకొరిగాయి.. కర్ణాటక రాష్ట్రంలో సైతం దారుణంగా నాశనమయ్యాయి. దీంతో ఎలుగుబంట్లు, హైనాలు, అడవి పందులు తలదాచుకునే మార్గం లేక కరువైంది. దీంతో బయటకు వస్తున్న వన్యప్రాణులు కనబడిన మనుషులు ఎక్కడ హానీ తలపెడతారోనని ఎదురుదాడి చేస్తున్నాయి. అటవీశాఖ అధికారులు జంతువుల సంరక్షణ చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చిరుత పులి పిల్లలు, ఎలుగు బంట్లు, హైనాలు, జింకలు, ఇతర జంతువుల సంరక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు. అసలు తాండూరులో అరుదైన పక్షులు, జంతువులు ఎన్ని ఉన్నాయో గణన చేయలేని స్థితిలో అటవీశాఖ యంత్రాంగం ఉందని విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ఇవి చేయాలి

సాధారణంగా నీరున్న ప్రాంతాల్లోనే వన్యప్రాణుల సంచారం అధికంగా ఉంటుంది. కానీ ఇటీవల అడవులు, కొండ ప్రాంతాల్లో నీరు లేకపోవడంతో వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. అందుకే అడవులు, కొండ ప్రాంతాల్లో చెలమలు, ఫైర్‌లైన్స్‌, సాసర్‌ పీట్లను ఏర్పాటు చేయాలి. నిఘా వలయాలు ఏర్పాటు చేస్తే వన్యప్రాణుల కదలికలను తెలుసుకోవచ్చు. వేటగాళ్లను నియంత్రించవచ్చు. సాసర్లు నిర్మించాలి. ఏటా వేసవిలో ట్యాంకర్లతో సాసర్లను నింపితే వన్యప్రాణుల దాహార్తిని తీర్చవచ్చు. సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తే దీనికి శాశ్వత పరిష్కార మార్గం చూపినట్టవుతుంది.


Similar News