మండలి చీఫ్ విప్ గా పట్నం బాధ్యతలు చేపట్టిన పట్నం మహేందర్ రెడ్డి

పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రులు ఆయన్ను అభినందించారు.

Update: 2024-10-09 14:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర శాసనమండలి చీఫ్ విప్ (Telangana Legislative Council Chief Whip) గా పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahendar Reddy) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు (Minister Sridhar), పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్ర చట్టసభల్లో సుదీర్ఘ అనుభవమున్న మహేందర్ రెడ్డికి మండలి చీఫ్ విప్ రావడం సంతోషకరం అన్నారు. మండలిలో శాసన తయారీ ప్రక్రియ, చర్చ లాంటి అంశాల్లో తోటి సభ్యులకు చేదోడువాదుడుగా పట్నం ఉంటారన్నారు. ఆయనతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు మరింత సహాయ సహకారాలు అందజేస్తానన్నారు.

మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మండలి చీఫ్ విప్ గా అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మండలిలో సీనియర్ సభ్యుడిగా సభ్యులందరికీ చేదోడు వాదోడుగా ఉంటానన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అందరితో కలిసి చట్టసభల ద్వారా ప్రజలకు అందుబాటులో వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. స్పీకర్ తో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని, అందరికీ అందుబాటులో ఉంటామని వెల్లడించారు. అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వంగా కలిశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్ నర్సింహాచార్యులు, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, ఈర్లపల్లి శంకర్, మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీలు కోదండరాం, బల్మూరి వెంకట్, ఎగ్గే మల్లేష్, భాను ప్రకాష్, ప్రభాకర్, మాజీ ఎంపీలు మధుయాష్కి గౌడ్, గడ్డం రంజిత్ రెడ్డి, వికారాబాద్ జడ్పీ మాజీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News